Nizamabad: నిజామాబాద్ నగరంలో ఓ విచారకరమైన ఘటన వెలుగు చూసింది. కేవలం ఒక ‘గుడ్డు కూర’ విషయంలో మొదలైన చిన్న గొడవ, ఒక నిండు ప్రాణం పోవడానికి, మరొకరు జైలు పాలు కావడానికి కారణమైంది. ఎనిమిదేళ్లుగా కలిసుంటున్న ఇద్దరి మధ్య మద్యం తీసుకొచ్చిన గొడవలు చివరకు ఈ దారుణానికి దారి తీశాయి.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 40 ఏళ్ల మోహన్ బతుకుదెరువు కోసం నిజామాబాద్కు వలస వచ్చి భవన నిర్మాణ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వినాయకనగర్కు చెందిన సౌందర్యతో అతడికి పరిచయం ఏర్పడింది. సౌందర్యకు ఇదివరకే విడాకులు కావడంతో, వీరిద్దరూ గత ఎనిమిదేళ్లుగా ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.
మద్యానికి బానిసైన మోహన్ తరచూ సౌందర్యను వేధిస్తుండేవాడు. ఆదివారం రోజు మోహన్ తాగి వచ్చి, ఇంట్లో ‘గుడ్డు కూర’ ఎందుకు వండలేదని ఆమెతో గొడవకు దిగాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ తీవ్రమైంది. అప్పటికే అతడి వేధింపులతో విసిగిపోయి ఉన్న సౌందర్య, ఆవేశంలో తన చీరతో మోహన్ మెడకు ఉరి బిగించి హతమార్చింది.
ముందుగా ఇది అనుమానాస్పద మృతిగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సౌందర్యను తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటపడింది. తనను వేధిస్తుండటం వల్లే ఆవేశంలో ఈ పని చేశానని ఆమె నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను రిమాండ్కు తరలించారు.
Also Read:ఢిల్లీలో రీసౌండ్ ఇస్తున్న రేవంత్ వాయిస్.. GDP ఆధారిత సీట్ల పెంపు సాధ్యమేనా?