Palnadu: పల్నాడు జిల్లాలో గుండెలను పిండేసే ఒక విషాద ఘటన తృటిలో తప్పింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అని భావించిన ఒక నిండు కుటుంబాన్ని పోలీసులు తమ సమయస్ఫూర్తితో కాపాడి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
తీవ్ర మనస్తాపం.. కఠిన నిర్ణయం
మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్నాథ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. చేసిన అప్పులు కొండలా పెరిగిపోవడం, మరోవైపు వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి ఎక్కువవ్వడంతో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుకున్నాడు. చివరకు భార్య, తన ఇద్దరు చిన్నారులతో (3, 5 ఏళ్లు) కలిసి ఈ లోకాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
సమయస్ఫూర్తితో స్పందించిన పోలీసులు
అందరూ కలిసి కారులో బయలుదేరిన సమయంలో, అమర్నాథ్ భార్య తమ ఆత్మహత్య నిర్ణయం గురించి పుట్టింటి వారికి మెసేజ్ పంపింది. దాంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఎస్సై కిషోర్ , ఆయన బృందం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. టెక్నాలజీ సాయంతో కారు ఎటు వెళ్తుందో నిరంతరం ట్రాక్ చేస్తూ.. సినిమా ఫక్కీలో కారును వెంబడించి అడ్డగించారు.
కొత్త జీవితానికి భరోసా
మృత్యువు అంచున ఉన్న ఆ కుటుంబాన్ని క్షేమంగా కాపాడిన పోలీసులు, వారిని స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ‘సమస్యలు తాత్కాలికమే, కానీ ప్రాణం శాశ్వతం.. ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు’ అంటూ వారికి ధైర్యాన్ని నూరిపోశారు. సమయానికి స్పందించి ఒక కుటుంబాన్ని నిలబెట్టిన ఎస్సై కిషోర్ను ఉన్నతాధికారులతో పాటు స్థానికులు కూడా ఆకాశానికెత్తేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: అమరావతి సాక్షిగా పొలిటికల్ రీ-ఎంట్రీ.. విజయసాయిరెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా!
అప్పుల బాధతో కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం
కారుని ట్రేస్ చేసి.. ఫ్యామిలీని కాపాడిన పోలీసులు
అప్పుల పాలైన మాచర్లలోని దుర్గికి చెందిన అమర్నాథ్
చేసిన అప్పులు చెల్లించలేక..వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక..
ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయంభార్య, కొడుకు, కుమార్తెలతో… pic.twitter.com/BBdGbrVvev
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2026