Psycho Man: చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఒక వ్యక్తి ‘సైకో’లా ప్రవర్తిస్తూ ఏకంగా పోలీసు వాహనాన్ని దొంగిలించి రోడ్లపై బీభత్సం సృష్టించడం సంచలనంగా మారింది.
గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పోలీసు జీపును ఒక వ్యక్తి చాకచక్యంగా దొంగిలించాడు. వాహనం అదుపులోకి రాగానే అతను రోడ్డుపై అతివేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనాలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఆటోతో పాటు మరో మూడు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం తర్వాత స్థానికులు ఒక్కసారిగా తిరగబడటంతో.. భయపడిన ఆ వ్యక్తి జీపును వదిలేసి పక్కనే ఉన్న చెరువులోకి దూకి దాక్కున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ.. అతను బయటకు రావడానికి నిరాకరించాడు. దీనితో పోలీసులు, ఫైర్ సిబ్బంది , స్థానికులు కలిసి భారీ ఆపరేషన్ చేపట్టారు.
చివరికి తాళ్ల సహాయంతో చెరువులో ఉన్న నిందితుడిని అతి కష్టం మీద చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించి.. అతను మానసిక స్థితి సరిగా లేక ఇలా చేశాడా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పట్టపగలే పోలీస్ వాహనాన్నే దొంగిలించి ఇంతటి బీభత్సం సృష్టించడంతో స్థానిక ప్రజలు విస్మయానికి గురయ్యారు.
Also Read:తోటి విద్యార్థుల వేధింపులకు పీజీ విద్యార్థిని సూసైడ్
https://twitter.com/bigtvtelugu/status/2033809937592414222