పూణే నగరంలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ కార్యాలయంలో పని చేసే మహిళను ఆమె బాస్ భార్యే కిరాతకంగా హతమార్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. ‘పూణేకు చెందిన 35 ఏళ్ల పూనమ్ దినేష్ మున్ స్థానిక న్యాయవాది సంజయ్ సావంత్ వద్ద ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. సంజయ్ భార్య స్వాతి సావంత్ (42) గత కొంతకాలంగా పూనమ్ పట్ల ఆగ్రహంతో ఉంది. తన భర్తతో పూనమ్ అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె అనుమానం పెట్టుకుంది. ఈ క్రమంలోనే కార్యాలయంలో ఒంటరిగా ఉన్న సమయంలో పూనమ్ పై స్వాతి దాడికి దిగింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న స్వాతి ఒక ఇనుప వస్తువుతో పూనమ్ తలపై బలంగా బాదింది. తీవ్ర గాయాలైన పూనమ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది’ అని పోలీసులు వెల్లడించారు
‘హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను తెలియకుండా ఉండాలని స్వాతి భావించింది. పూనమ్ మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి ఎవరికీ తెలియకుండా తరలించేందుకు ప్లాన్ వేసింది. అయితే పూనమ్ సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ఆందోళన చెందాడు. మరుసటి రోజు ఉదయం అతను పోలీసులకు ఫిర్యాదు చేసి నేరుగా సంజయ్ సావంత్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న భార్య మృతదేహాన్ని గుర్తించాడు’ అని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వాతి సావంత్ భర్త సంజయ్ సావంత్ ఒక ప్రముఖ రాజకీయ పార్టీ లీగల్ వింగ్లో రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆయనకు సమాజంలో పలువురు ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. ఇంతటి కీలక వ్యక్తి ఇంట్లోనే ఇటువంటి నేరం జరగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఇప్పటికే స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
ALSO READ: తెలంగాణ స్టైల్ బగారా అన్నం.. ముద్దపప్పు లేదా నాటుకోడి కూరతో తింటే ఇక స్వర్గమే!