Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలోని రాయి కోడ్ మండలం శంశోద్దీన్పూర్ గ్రామంలో జరిగిన అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పీపడ్పల్లి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న చాల్కి రాజు మృతి చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మద్దతుతో బరిలో దిగిన ఆయన, ప్రచార వేగం పెరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఇలా ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పీపడ్పల్లి, శంశోద్దీన్పూర్ గ్రామాల్లో రాజకీయ వేడి నెలకొంది. చాల్కి రాజు గత కొన్ని రోజులుగా గ్రామంలో తిరుగుతూ తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతున్నారు.
అయితే నిన్న రాత్రి రాజు, కొంతమంది మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ వాగ్వాదం కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రచార వ్యూహం, గ్రూప్ రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలు వంటి అంశాలే దీనికి కారణమై ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఉదయం ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందారు. కాగా ఓ చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ ఉన్న చాల్కి రాజు మృతదేహాన్ని.. ఉదయం గ్రామస్తులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇది ఆత్మహత్యా? లేక వేరే కారణాలున్నాయా? అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
ఈ సంఘటనతో శంశోద్దీన్పూర్, పీపడ్పల్లి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. చాల్కి రాజు అనుచరులు, కుటుంబ సభ్యులు ఈ మరణం పట్ల తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు సంఘటన జరిగిందని చెప్పడానికి ముందే గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో అక్కడ అదనపు బలగాలను నియమించారు.
Also Read: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కింద పడి 11 ఏళ్ల బాలుడు మృతి..
ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా మండల, జిల్లా స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఈ రకమైన సంఘటనలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేస్తాయి.