Karimganar: కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఇల్లందకుంట మండలం, శ్రీరాములపల్లి గ్రామంలో విషాదం జరిగింది. ఏడు నెలల గర్భిణీ అయిన మౌనిక (21) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడమే తన కూతురు ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మృతురాలు మౌనిక వివాహం గత డిసెంబర్ నెలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం, బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్ తో జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద కొంత మొత్తాన్ని.. బంగారం, ఇతర సామగ్రిని ఇచ్చారు. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే ప్రశాంత్, అతని కుటుంబ సభ్యులు మరింత అదనపు కట్నం తీసుకురావాలని మౌనికను వేధించడం ప్రారంభించారని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వేధింపులు రోజురోజుకు ఎక్కువవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక తన పుట్టినిల్లు శ్రీరాములపల్లిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కట్నం వేధింపుల కారణంగానే తమ ఏడు నెలల గర్భంతో ఉన్న కూతురు బలవన్మరణానికి పాల్పడిందని.. దీనికి కారణమైన భర్త ప్రశాంత్తో పాటు అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే శ్రీరాములపల్లి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మౌనిక మృతికి కట్నం వేధింపులే కారణమా అనే కోణంలో పోలీసులు కూలంకషంగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.