Shadi Scam: స్వేచ్ఛ బ్యూరో: పేదల కోసం అమలు చేస్తున్న షాదీ ముబారక్ పథకాన్ని అడ్డం పెట్టుకొని లక్షలు కొట్టేయ్యాలని కుట్ర చేసిన రెవిన్యూ ఇన్స్ పెక్టర్ తోపాటు అయిదుగురు బ్రోకర్లను రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయుల పెళ్లి నిశ్చయం అయితే ఆర్ధికంగా ఆదుకోవటానికి ప్రభుత్వం షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
వార్షిక ఆదాయం 2లక్షల లోపు ఉన్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన్ ఈ పథకం కింద 1,00,116 ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు. సరిగ్గా దీనిని అవకాశంగా చేసుకొని బండ్లగూడ ఆర్ఐ ధరావత్ అశోక్ కిరణ్ మొహమ్మద్ ఏతేమాద్ ఉల్ హక్, మొహమ్మద్ అక్బర్, సయ్యద్ ముషారఫుద్దీన్, మొహమ్మద్ సర్ఫరాజ్, మొహమ్మద్ జాఫర్ లతో కలిసి పథకం వేశాడు. దాని ప్రకారం మొహమ్మద్ ఏతేమాద్ పెయింట్, ఆడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ లను ఉపయోగించి వధువుల ఫోటోలు, ఆధార్ వివరాలు, వివాహ ధృవపత్రాలు, ఇతర సహాయక పత్రాలలో మార్పులు చేసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశాడు.
Also read: Huzurabad: హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డికి.. వొడితల ప్రణవ్ హైవోల్టేజ్ సవాల్..?
మొహమ్మద్ అక్బర్ నకిలీ దరఖాస్తులను సేకరించి వాటిని బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలోని స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కిరణ్ ద్వారా సమర్పించి, అవసరమైన ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే తదుపరి ప్రక్రియకు పంపేలా చూశాడు. ముషరఫ్, సర్ఫరాజ్ మరియు జాఫర్ లు నకిలీ లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, విద్యుత్ బిల్లులు, వివాహ ఫోటోలు, ఇతర సహాయక పత్రాలను సేకరించేవాడు. వీలు పడని పక్షంలో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడంలో సహకరించేవాడు. ఇలా నిందితులు అందరూ కలిసి 21లక్షలు కొల్లగొట్టి పంచుకున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారం సేకరించిన రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులు అందరినీ అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు.
Also read: Miss Universe: తళుక్కుమన్న మిస్ యూనివర్స్ తెలంగాణ.. నేషనల్ లెవెల్కు ఇద్దరు ఎంపిక..!