Miss Universe: స్వేచ్ఛ బ్యూరో: నగరంలో మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే విజేతలు, ఇతర మోడల్స్ తళుక్కుమన్నారు. బంజారాహిల్స్ లో సందడి చేశారు. మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో విజేతలు, టైటిల్ హోల్డర్లతో శనివారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా బంజారాహిల్స్ లోని ఎంప్రా బై ప్రతివాది డిజైనర్ స్టోర్ లో మిస్ యూనివర్స్ భామలు సందడి చేశారు. కాగా మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ ఏపీ ఫైనలిస్టులు రన్నర్లు.. ప్రత్యేక డిజైనర్ కలెక్షన్స్ ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి మిస్ యూనివర్స్ ఇండియా 2025 మానికా విశ్వకర్మ, మిస్ యూనివర్స్ ఇండియా ఫ్రాంచైజ్ ఆపరేషన్స్ డైరెక్టర్ అంజద్ ఖాన్, మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 కాశ్వి హాజరై పోటీదారులను అభినందించారు. అందంతో పాటు నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ఈ వేదిక యువతులకు స్ఫూర్తిగా నిలుస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలు తమ విజయ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్ లక్ష్యాల గురించి మీడియాతో పంచుకున్నారు. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చని యువతకు సందేశమిచ్చారు.
Also read: PHC Negligence: చల్లూర్ పీహెచ్సీలో రోగుల ప్రాణాలతో చెలగాటం!
మహిళా సాధికారత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలను ప్రోత్సహించే వేదికగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీలు నిలుస్తున్నాయని మిస్ యూనివర్స్ తెలంగాణ, ఏపీ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ సునీత తెలిపారు. ఈ ఏడాది విజేతలు జాతీయ స్థాయి పోటీల్లో తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా ఇటీవల హైదరాబాద్లోని సైబర్ గార్డెన్స్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన 40 మంది ఫైనలిస్టులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
అందులో ఇద్దరు ఫైనలిస్టులు కిరీటం గెలుచుకున్నారు. మిస్ యూనివర్స్ తెలంగాణ 2026 విజేత హసిత నారాయణభట్ట, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2026 విజేత ఫసీహా నౌమాన్ నేషనల్ లెవల్ లో జరగబోయే పోటీల్లో పాల్గొనన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ డిజైనర్ మాధురి ప్రతి వాది ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ డ్రెస్సుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమావేశంలో మిస్ యూనివర్స్ తెలంగాణ 2026 ఫస్ట్ రన్నరప్ సృష్టి కనిందే, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రన్నరప్ హిమ వర్మ, సెకండ్ రన్నరప్ సోనాలి యాదవ్ పాల్గొన్నారు.
Also read: Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం