Software Engineer: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వీకెండ్ ఎంజాయ్ చేద్దామని స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫామ్హౌస్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వీకెండ్ పార్టీలో విషాదం
హైదరాబాద్ రామంతాపూర్లోని ‘NSL సాఫ్ట్వేర్’ కంపెనీలో పనిచేసే 15 మంది ఉద్యోగులు వీకెండ్ కావడంతో కాస్త రిలాక్స్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే వారంతా శనివారం సాయంత్రం కొయ్యలగూడెం సమీపంలోని ఒక ఫామ్హౌస్కు చేరుకున్నారు. అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటూ సరదాగా గడిపారు. అయితే, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పార్టీ జరుగుతుండగానే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండ్ల మధు (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందినవాడిగా గుర్తింపు పొందాడు.
Also read: కృష్ణానదిలో పడవ ప్రమాదం.. నలుగురు గల్లంతు!
తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు షురూ
మధు మరణవార్త విన్న కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ మధు తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీలో ఏం జరిగింది? అసలు మధు ఎలా చనిపోయాడు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో చౌటుప్పల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ఫామ్హౌస్ను పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
స్నేహితుల విచారణ
పార్టీకి హాజరైన మిగిలిన 14 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. శనివారం రాత్రి అసలు ఏం జరిగింది? మధు మరణానికి గల కారణాలేంటి అనే కోణంలో వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల సమగ్ర విచారణ అనంతరం తెలియాల్సి ఉంది. ఆఫీస్ కొలీగ్స్తో కలిసి పార్టీకి వెళ్లిన యువకుడు ఇలా శవమై తిరిగిరావడంతో మధు స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.