Road Accident: జయ శంకర్ భూపాల పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో నిండి ప్రయాణిస్తున్న టాటా ఏసీ వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
సంఘటన సమయంలో వాహనంలో 50 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్లు.. పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కూలీలు జూకల్ వైపు పనిచేయడానికి వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కూలీల సంఖ్య భారీగా ఉండటం, వాహనం సామర్థ్యాన్ని మించిన బరువు ఉండటం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
డ్రైవర్ అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక వాహనం ఓవర్లోడ్ వల్ల జరిగిందా అన్నదానిపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read: స్థానిక ఎన్నికల ఇష్యూకు ఎండ్ కార్డు..! హైకోర్టులో విచారణ
గాయపడినవారికి అన్ని విధాల సహాయం అందజేస్తామని, అవసరం అయితే మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు తరలిస్తామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. మెదక్ జిల్లా తూప్రాన్లోని 44వ జాతీయ రహదారిపై భారీ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి రోడ్డుపై ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ ట్రాఫిక్ బారియర్లను ఒక్కసారిగా ఢీకొట్టింది. ఆపై హల్దీ వాగులోకి దూసుకెళ్లింది. ఢిల్లీ నుండి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్ విమల్ యాదవ్, క్లినర్ వికాస్ యాదవ్ ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.