Telangana Local Body Elections: స్థానిక ఎన్నికల నిర్వాహణపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలియజేయనున్నాయి. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్ల తుది నిర్ణయం, జాబితాల సిద్ధం, ఓటర్ల వివరాల ఖరారు వంటి అంశాలపై.. వేగంగా జరుగుతున్న చర్యలు ఇప్పుడు అధికారికంగా కోర్టు ముందు స్పష్టత తీసుకురానున్నాయి.
భారత రాజ్యాంగం ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 46ను విడుదల చేసింది. ఈ జీవో ద్వారా రిజర్వేషన్లను 50% లోపే ఉంచుతూ, వర్గాల వారీగా వాటా కేటాయింపును స్పష్టంగా పేర్కొంది. పట్టణ స్థానిక సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలు రెండింటికీ వర్తించే విధంగా ఈ విధానాన్ని రూపొందించారు.
రిజర్వేషన్ల జాబితాలు జిల్లాల వారీగా పూర్తయి, పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయానికి చేరాయి. ప్రత్యేక బృందాలు అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, ఎలాంటి గందరగోళం లేకుండా తుది జాబితాలను సిద్ధం చేశాయి. ఈ జాబితాలు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా చేరాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల జాబితాల వంటి అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 12733 గ్రామపంచాయతీలు ఉండగా, వీటిలో 1,12,288 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ సచివాలయాలలో వాటిని ప్రదర్శించగా, అభ్యంతరాల స్వీకరణకు కూడా అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలిపి చూస్తే కోటి 67 లక్షల 3 వేల 173 మంది ఓటర్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: పంచాయితీ ఎన్నికలకు అంతా రెడీ, ఇవాళ గెజిట్ నోటిఫికేషన్లు జారీ?
ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,12,474 పోలీస్ సిబ్బందిను ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అదనంగా 152 పోలింగ్ సెన్సిటివ్ ప్రాంతాలు గుర్తిస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న ప్రాంతాలను ప్రత్యేకంగా మ్యాప్ చేసి, అక్కడ అదనపు బలగాలను మోహరించే నిర్ణయం తీసుకున్నారు. ఇక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మరింత వేగం అందుకోనుంది.