Label Tampering: స్వేచ్ఛ బ్యూరో: అల్వాల్లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్స్ (ఔషధ తయారీలో ఉపయోగించే సహాయక పదార్థాలు)పై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్, కల్పిత తయారీ వివరాల వినియోగం కేసును తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రూ.70.56 లక్షల విలువైన స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు డీసీఏ అధికారులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం ఓల్డ్ అల్వాల్లోని మంగాపురం కాలనీ, ప్లాట్ నెం.124, హెచ్.నెం.1-5-1095/1/1, మూడో అంతస్తులో ఉన్న డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. దాడుల సందర్భంగా హైడ్రాక్సీప్రొపైల్ బెటాడెక్స్ యూఎస్పీ/ఎన్ఎఫ్ అనే ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్కు చెందిన 12 కార్డ్బోర్డ్ డ్రమ్లు గుర్తించారు. ఒక్కో డ్రమ్లో 20 కిలోల చొప్పున మొత్తం 240 కిలోల నిల్వ ఉన్నట్లు తేలింది. వాటిపై బ్యాచ్ నెం. RHPB/2026/05/002, తయారీ తేదీ 05/2026, గడువు తేదీ 04/2029గా లేబుళ్లు అతికించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read: YouTubeను సోషల్ మీడియాగా మార్చే భారీ ప్లాన్.. ఇక యాప్లోనే చాటింగ్, వీడియో షేరింగ్!
అలాగే ఉత్పత్తి తయారీదారుగా డీకే ఫార్మాస్యూటికల్స్, తయారీ చిరునామాగా ప్లాట్ నెం.59/B, ఈపీఐపీ, పశమైలారం, సంగారెడ్డి జిల్లా అని పేర్కొనగా, విచారణలో ఆ తయారీ యూనిట్ కల్పితమని, ఆ చిరునామాలో ఎలాంటి తయారీ కేంద్రం లేదని అధికారులు నిర్ధారించారు. తదుపరి విచారణలో డీకే ఫార్మాస్యూటికల్స్ భాగస్వాములు సతీష్ బాబు ధూలపల్లి, నాగస్వామి కట్రగడ్డ అసలు లేబుళ్లను తొలగించి, నకిలీ లేబుళ్లు అతికించి ఉత్పత్తులను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన అధికారులు, రూ.70.56 లక్షల విలువైన ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read: Huzurabad: హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డికి.. వొడితల ప్రణవ్ హైవోల్టేజ్ సవాల్..?