Drug Overdose: పాతబస్తీ–చాంద్రాయణగుట్ట ప్రాంతంలో విషాదక ఘటన చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ కింద నిలిపి ఉన్న ఓ ఆటోలో ఇద్దరు యువకులు మృతదేహాలుగా కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఉదయం వాకింగ్కు వెళ్లిన స్థానికులు ఆటోలో పడి ఉన్న ఇద్దరు యువకులను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. ఆటో లోపల ఇద్దరు యువకులు స్పృహతప్పి మరణించి ఉన్నట్లు నిర్ధారించారు.
ఈ ఘటన చాంద్రాయణగుట్ట పరిధిలో జరగడంతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆటోలో మూడు ఖాళీ ఇంజెక్షన్లు లభ్యమవడంతో డ్రగ్స్ ఓవర్డోస్ కారణంగానే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆటోలో ఇద్దరు మాత్రమే మృతి చెందగా, మూడవ వ్యక్తి పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
పోలీసుల విచారణ ప్రకారం మృతులను జహంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. వీరు ఇద్దరూ పాతబస్తీ ప్రాంతానికి చెందిన యువకులుగా తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతి కారణం ఖచ్చితంగా తేలనుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇది డ్రగ్స్ ఓవర్డోస్ కేసుగానే అనుమానిస్తుండగా, ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆటో ఎవరిది? ఈ యువకులు ఎక్కడి నుంచి వచ్చారు? డ్రగ్స్ను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మూడవ వ్యక్తి ఎక్కడికి వెళ్లాడు? వంటి అనేక కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
Also Read: రూటు మారిన సహజీవనం.. పార్టనర్ని చంపి, ఆ తర్వాత ఆత్మహత్య, బెంగుళూరులో దారుణం
డ్రగ్స్ వినియోగం కారణంగా యువత ప్రాణాలు కోల్పోతుండటం.. ఆందోళనకర పరిణామమని పోలీసులు పేర్కొన్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని అన్నారు.




















