Auto Hits RTC Bus: విశాఖపట్నం నగరంలోని హనుమంతువాక జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల కోసం రోడ్డుమధ్యలో హఠాత్తుగా ఆగిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో, అందులో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పెను ప్రమాదం తప్పిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమంతువాక జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించేందుకు.. రోడ్డుమధ్యలోనే అకస్మాత్తుగా ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆటో బస్సును ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆటో ముందుభాగం దెబ్బతిని, లోపల కూర్చున్న విద్యార్ధులకు స్వల్ప గాయులు అయ్యాయి.
ఢీకొట్టిన వెంటనే విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో.. చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొందరు స్థానికులు విద్యార్థులను బయటకు తీసి, వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ గాయాలు స్వల్పంగానే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోవడంతో వాహనాలను మళ్లించి రాకపోకలను సజావుగా చేశారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Also Read: రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రైవర్ నిర్లక్ష్యం లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు తెలిపారు.