విశాఖ నగరంలోని పెదగంట్యాడ పరిధి వికాస్ నగర్లో ఆదివారం భారీ ప్రమాదం సంభవించింది. లో లెవల్లో ఉన్న పాత ఇంటిని జాకీల సహాయంతో పైకి ఎత్తేందుకు ప్రయత్నిస్తుండగా ఊహించని విధంగా ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్లాబ్ భారీ శబ్దంతో కిందకు పడిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఇల్లు రోడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉండటంతో యజమాని దానిని పైకి లేపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక టెక్నాలజీతో వాడుతూ జాకీలను అమర్చారు. పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడంతో ఇల్లు పేకమేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి కాపాడే ప్రయత్నం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాలను తొలగించేందుకు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు జేసీబీ యంత్రాలను రంగంలోకి దించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!