Gas Shortage: స్వేచ్ఛ బ్యూరో: మహబూబాబాద్ జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నర్సింహులపేట మండలంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు అర్ధరాత్రి నుంచే ఏజెన్సీ కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారు. సిలిండర్ దొరుకుతుందో లేదో అన్న అనిశ్చితిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు సైతం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు రాత్రంతా అక్కడికక్కడే పడుకుని ఉదయం పంపిణీ ప్రారంభమయ్యే వరకు నిరీక్షించాల్సి వస్తోంది.
ఎన్నో రోజుల క్రితమే గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పటికీ సిలిండర్లు సమయానికి అందకపోవడంపై వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సరఫరాలో జాప్యానికి కారణాలపై గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. రోజువారీ అవసరాలకు వంటగ్యాస్పై ఆధారపడే కుటుంబాలు ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారి, గృహిణులు వంట చేసేందుకు ఇంధనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వినియోగదారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. గ్యాస్ సిలిండర్లను జాతీయ రహదారిపై ఉంచి బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో కొంతసేపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also read: మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం.. సబ్ స్టేషన్లో ఎగిసిపడ్డ మంటలు!
వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గ్యాస్ సరఫరాలో నెలకొన్న సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సిలిండర్లను సక్రమంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కొరత పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం నర్సింహులపేటలో నెలకొన్న ఈ పరిస్థితి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also read: మూడు ముక్కల జీహెచ్ఎంసీతో ముప్పు తిప్పలు పడుతున్న జనం.. వెలుగులోకి విచిత్ర పరిస్థితులు..!