పర్వతగిరి మండల కేంద్రంలో నాగరిక సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. చదువుకోవడానికి వెళ్లిన ఓ మైనర్ బాలికపై కామాంధుడు అమానుషానికి ఒడిగట్టాడు. నిర్మానుష్యంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బాలికపై అత్యాచారయత్నం చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పర్వతగిరి మండల పరిధిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన ఒక మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ధరావత్ సురేష్ అనే యువకుడు కన్నేశాడు. పాఠశాల ఆవరణలో ఎవరూ లేని సమయాన్ని గమనించిన నిందితుడు, బాలికపై ఒక్కసారిగా దాడి చేసి అత్యాచారానికి ప్రయత్నించాడు. భయంతో వణికిపోయిన ఆ బాలిక తనను తాను రక్షించుకోవడానికి గట్టిగా కేకలు వేసింది.
కాపాడిన అంగన్వాడీ ఆయా..
బాలిక అరుపులు విన్న సమీపంలోని అంగన్వాడీ ఆయా వెంటనే అప్రమత్తమైంది. పాఠశాల వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా, సురేష్ బాలికను వేధిస్తుండటం గమనించింది. ఆయా ధైర్యంగా స్పందించడంతో భయపడిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే ఆయా బాలికను ఓదార్చి, సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. జరిగిన విషయాన్ని వివరించడంతో వారు షాక్కు గురయ్యారు.
నిందితుడిపై పోక్సో కేసు నమోదు
ఈ అమానుష ఘటనపై బాలిక తల్లిదండ్రులు వెంటనే పర్వతగిరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు ధరావత్ సురేష్పై పోలీసులు కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, దర్యాప్తును వేగవంతం చేశారు.