Dhar Crime: మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. నూరేళ్లూ తోడుంటానని చెప్పిన భార్యే, కాలయముడై భర్త ప్రాణాలు తీయడం పెళ్లి అనే బంధానికే మచ్చతెచ్చింది. కేవలం భర్త రంగు తక్కువని, తన అందానికి అతను సరిపోడని ఓ మహిళ చేసిన ఘాతుకం ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది.
ప్రియాంక అనే మహిళకు తన భర్త రూపం నచ్చలేదు. ‘నువ్వు నల్లగా ఉన్నావు, నా రేంజ్కు సరిపోవు’ అంటూ నిత్యం అతనితో గొడవపడేది. ఈ క్రమంలోనే ఆమెకు కమలేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తన సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ప్రియాంక, ప్రియుడితో కలిసి అతడిని వదిలించుకోవాలని స్కెచ్ వేసింది. ఇందుకోసం ఏకంగా ఒక లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి మరీ కిరాతకానికి ఒడిగట్టింది.
ప్రియుడు, అతని స్నేహితుడి సహాయంతో భర్తను అతి దారుణంగా హత్య చేయించింది. అయితే, తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె పెద్ద డ్రామానే ఆడింది. ఇంట్లోకి దొంగలు పడ్డారని, వారే దోపిడీ చేసి తన భర్తను చంపేశారని నమ్మించే ప్రయత్నం చేసింది. కళ్ళముందే భర్త ప్రాణాలు పోతుంటే ఏమీ తెలియనట్టు నటించింది.
పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేయడంతో ప్రియాంక అసలు రంగు బయటపడింది. ఆమె ఫోన్ కాల్స్, ప్రవర్తనపై అనుమానం వచ్చి నిలదీయగా.. తానే తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించింది. అందం, అక్రమ సంబంధం అనే వ్యామోహంలో పడి, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ కిరాతకులను చూసి స్థానికులు విస్తుపోతున్నారు. కేవలం రంగును సాకుగా చూపి హత్య చేయడం ఆమెలోని క్రూరత్వానికి పరాకాష్ట.
Also Read: మంత్రి పొన్నం ప్రభాకర్ బంపర్ ఆఫర్.. ఇకపై వారికి కూడా ఉపాధి గ్యారంటీ!