Dharmaraja: సొంత తల్లిని ధర్మ రాజు ఎందుకు శపించాడు. కుంతి శాపమే ఈనాటికీ మహిళలను ఎందుకు వేధిస్తుంది..? ఇంతకీ ధర్మరాజు, కుంతీదేవికి ఇచ్చిన శాపం ఏంటి..? ధర్మజుడు శాపం ఇవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి. శాపం తర్వాత కుంతీదేవి రియాక్షన్ ఎలా ఉండేది. ఇంతవరకు చాలా మందికి తెలియని మహాభారతంలోని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
పాండు రాజు భార్యలలో ఒకరైన కుంతీదేవికి ధర్మరాజు ఇచ్చిన శాపం గురించి తెలుసుకోవాలంటే మొదట కర్ణుడి గురించి తెలుసుకోవాలి. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన, వివాదాస్పదమైన మరియు భావోద్వేగపూరితమైన పాత్ర ‘కర్ణుడు’ ఈ కర్ణుడి పుట్టుక నుంచి గిట్టుక వరకు తెలుసుకుంటేనే కుంతీ శాపం అర్థం అవుతుంది.
కుంతీ భోజుడి కుమార్తె అయిన కుంతి, దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షిస్తూ సూర్యదేవుడిని ధ్యానిస్తుంది. ఆ మంత్ర ప్రభావంతో సూర్య భగవానుడి అంశతో కుంతికీ పెళ్లి కాకుండానే కర్ణుడు పుడతాడు. పుట్టుకతోనే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మిస్తాడు. అయితే వివాహం కాక ముందే బిడ్డ పుట్టడంతో కుంతీ భయపడి కర్ణుడిని ఒక పెట్టెలో పెట్టి గంగా నదిలో వదిలేస్తుంది.
నదిలో కొట్టుకుపోతున్న ఆ పెట్టెను ధృతరాష్ట్రుని సారథి అయిన అధిరథుడు, అతని భార్య రాధ చూస్తారు. సంతానం లేని వారు కర్ణుడిని పెంచుకుంటారు. రాధ పెంచడం వల్ల అతనికి రాధేయుడు అని పేరు వచ్చింది. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు వసుషేణుడు.
కర్ణుడు క్షత్రియ కుమారుడు కాదనే కారణంతో ద్రోణాచార్యుడు అస్త్ర విద్య నేర్పను అంటాడు. దీంతో కర్ణుడు బ్రాహ్మణ వేషంలో వెళ్లి పరశురాముడి వద్ద శిష్యుడిగా చేరతాడు. తర్వాత ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రిస్తుండగా, ఒక కీటకం కర్ణుడి తొడను తొలి చేస్తుంది. గురువు నిద్ర చెడకూడదని కర్ణుడు ఆ నొప్పిని భరిస్తాడు. రక్తం తగలగానే మేల్కొన్న పరశురాముడు, ఇంతటి ఓర్పు బ్రాహ్మణుడికి ఉండదని, నువ్వు క్షత్రియుడివని గ్రహించి, “అవసరమైన సమయంలో నీ విద్య నీకు గుర్తుకు రాదు” అంటూ శపిస్తాడు.
హస్తినాపురంలో రాజకుమారుల అస్త్ర ప్రదర్శన జరుగుతుండగా అక్కడకు వెళ్లిన కర్ణుడికి దుర్యోధనుడితో స్నేహం ఏర్పడుతుంది. దీంతో కర్ణుడిని దుర్యోధనుడు అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. అలా కౌరవులతో కలిసిపోయిన కర్ణుడు కురుక్షేత్ర యుద్దంలో కూడా కౌరవులతో కలిసి పోరాడతాడు. చివరకు యుద్దంలో 17వ రోజు అర్జునుడి చేతిలో కర్ణుడు మరణిస్తాడు. మరణించాక కర్ణుడి తేజస్సు సూర్యుడిలో విలీనమవుతుంది.
యుద్దంలో కర్ణుడు చనిపోయాడని తెలుసుకున్న కుంతీదేవి యుద్దభూమిలోకి వెళ్లి ఏడుస్తుంది. అది చూసిన ధర్మరాజు అనుమానంగా అమ్మా ఎవరో ఆయన చనిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడట. దీంతో కుంతీదేవి అసలు నిజం చెప్తుందట. కర్ణుడు ఎవరో కాదు. తన మొదటి బిడ్డ.. అని పంచ పాండవులకు అన్న అని చెప్పగానే.. పాండవులు షాక్ అవుతారట. ధర్మరాజు కోపంతో ఊగిపోతూ… తమ అన్నను తామే చంపుకున్నామన్న బాధతో.. “అమ్మా! ఇంతటి రహస్యాన్ని దాచి మా చేత అన్నను చంపించావు. ఈ రోజు నుండి ఈ లోకంలో ఏ స్త్రీ కూడా ఎటువంటి రహస్యాన్ని దాచలేదు గాక అంటూ శపిస్తాడు. అప్పుడు అలా ధర్మరాజు శాపం వల్ల ఇప్పటికీ మహిళలు తమకు తెలిసిన ఏ రహస్యాన్ని దాచలేరట. ఎవరికో ఒకరికి చెప్పకపోతే ప్రశాంతంగా ఉండలేరట. ఆ విధంగా కుంతీ శాపాన్ని ఇప్పటికీ స్త్రీలు అనుభవిస్తున్నారని పండితులు చెప్తుంటారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.