Srirama Navami 2024 Special: శ్రీరామ నవమి వ్రతాన్ని చైత్ర, వైశాఖ, శ్రావణ, కార్తీక మాసాలందు ఈ వ్రతం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. వత్రం ఆచరించే ముందు మనస్సులోనే మహాగణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకుకు నమస్కరించాలి. తర్వాత కుటుంబ సభ్యులు పేర్లు, గోత్రాలను తలుచుకుని వ్రతం ఆచరించాలి.
శ్రీరామ నవమి నాడు ఉదయాన్నే లేచి స్నానసంధ్యావందనాదులు ముగించుకుని, ముందుగా ఏర్పాటు చేసుకున్న వేదికపై పూజా మండపమును ఉంచి ఆయా దేవతలను ఆవాహన చేయాలి. శ్రీరామ చంద్రప్రభూ రామ ప్రతిమారూపుడవైన నిన్ను నీప్రీతి కోసం నీభక్తునికి దానము చేస్తానని సంకల్పించుకోవాలి.
Also Read: అష్టమి ఎప్పుడు..? ఏప్రిల్ 16 లేదా 17 ? పూజ ఏ సమయంలో చేస్తే మంచిది ?
కలశమును స్థాపించి, వస్త్రముతో కూడిన పూర్ణపాత్రమందు స్వర్ణ ప్రతిమ యందు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠచేసి పురుషసూక్త విధానముగా షోడశోపచారపూజలు చేయాలి. పూజానంతరము జగత్తంతా రామస్వరూపము. అట్టి రామునకు తల్లి లోకమాత కౌసల్యని పూజించాలి. ఓం నమో దశరథాయ అని దశరథుని పూజించాలి. ఫలపుష్ప జలములతో కూడిన పూర్ణ శంఖముతో అర్ఘ్యమును ఇవ్వాలి. . రాత్రి భజన జాగరణము చేసి ఉదయాన్నే లేచి నిత్య పూజ చేసి శ్రీరామ మూలమంత్రాన్ని 108 సార్లు జపిస్తూ హోమము చేయాలి. తర్వాత స్వర్ణమయమై అలంకరించిన రామ ప్రతిమను శుభ్రమైన వస్త్రంతో కలిపి దానమివ్వాలి.
రామ నవమి అనేది త్రేతా యుగంలో అయోధ్యలో శ్రీరామచంద్రుడు కనిపించినందుకు గుర్తుచేసే హిందూ పండుగ. శ్రీరామ నవమి నాడు శ్రీరామ కళ్యాణం మనకు లోకకళ్యాణార్థం వేడుకగా వస్తున్నది కానీ కళ్యాణం చేయడంతో శ్రీరామ నవమీ వ్రతం పరిపూర్ణమవదు. శ్రీరామనవమి నాడు ఏకభుక్తము, శ్రీరామ పూజ, సువర్ణ ప్రతిమాదానము చేయాలని శాస్త్రగ్రంధాలలో చెప్పారు. వీటితో పాటు కళ్యాణం చేసుకుంటే ఇంకావిశేషం. నవమినాడు ఏమీచేయడానికి శక్తిలేనివారు ఫలం,పత్రం,పుష్పం,తోయం… అన్నట్లు కేవలం రామనామం చేస్తూ కూర్చున్నా అనంత ఫలాన్ని పొందుతారు.