Sri Ramanavami Shobha Yatra 2024 : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో ప్రతిఏటా రాములోరి శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా రాములవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాములవారి శోభాయాత్ర జరిగే మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా తాగునీటికి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసింది. కొందరు స్వచ్ఛందంగా మజ్జిగ, నిమ్మరసంతో పాటు అల్పాహారాన్ని కూడా భక్తులకు అందించనున్నారు.
రాములవారి శోభాయాత్ర నేపథ్యంలో మూడు కమిషనరేట్లలో పోలీసులు 1000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. మద్యం దుకాణాలను 24 గంటలపాటు మూసివేశారు. యాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు.
శ్రీరామచంద్రమూర్తి శోభాయాత్ర సీతారాంబాగ్ లోని శ్రీరామాలయం నుంచి మొదలై.. మంగళ్ హాట్, జాలీ హనుమాన్, ధూల్ పేట్, పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బర్తన్ బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్యంబర్ బజార్, గౌలిగూడ చమన్, గురుద్వార, పుత్లిబౌలి, కోఠి మీదుగా సుల్తాన్ బజార్ లో ఉన్న హనుమాన్ వ్యాయామశాల మైదాన్ని చేరుకోవడంతో ముగియనుంది. యాత్ర రాత్రి 11.30 గంటలకు ముగుస్తుందని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. యాత్ర మొదలై ముగిసేంతవరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
Also Read : రాముడు మనకు చెబుతున్నదేమిటి?
గోషామహల్, సుల్తాన్ బజార్ పీఎస్ పరిధులలో వాహనాలను దారి మళ్లిస్తారు. ఆసిఫ్ నగర్ నుంచి వచ్చేవాళ్లు బోయిగూడ కమాన్ మీదుగా నాంపల్లి, మెహదీపట్నం వైపు వెళ్లాలని సూచించారు. అలాగే దారుస్సలాం నుంచి వచ్చే వాహనాలను ఆఘాపుర, చార్ కండిల్ చౌరస్తా, నాంపల్లి మీదుగా మళ్లించనున్నారు. ఇక తూర్పు మండలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాములోరి శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.