MP Raghunandan Rao: గజ్వేల్ స్వేచ్ఛ: స్వార్థ ప్రతిపక్ష రాజకీయ నాయకులకు కేంద్ర బడ్జెట్ వాస్తవాలు కనిపించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల బడ్జెట్ పై ఆరోపణలు పసలేనివని పేర్కొన్నారు. గజ్వేల్ లో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం మాట్లాడారు. కేటీఆర్, హరీష్, కవిత లు ఇష్టం వచ్చినట్లు బడ్జెట్ పై మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. రైల్వే బడ్జెట్ లో గతంలో కన్నా రైళ్లకు 15 శాతం, రోడ్లకు 10 శాతం కేటాయింపుల పెంపు జరిగిందన్నారు. బట్టి రాష్ట్రానికి ఏమొచ్చిందని అనడంలో వాస్తవం లేదని గతంలో కన్నా రూ 1300 కోట్లు డివల్యూషన్ ఫండ్ ఎక్కువ చేయడం జరిగిందని వివరించారు. అన్ని రాష్ట్రాల సమ్మిలిత అభివృద్ధి కోసం మోడీ బడ్జెట్ కేటాయింపులు జరిగాయని వివరించారు.
దక్షిణ భారతదేశానికి 7 హై స్పీడ్ రైలు వస్తే హైదరాబాదు కేంద్రంగానే 3 రైళ్లను కేటాయించడం జరిగిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. పదేళ్లు పాలనలో బిఆర్ఎస్ కు సోయరాలేదని, రెండేళ్ల పాలనలో ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళకు సోయి లేకుండా పోయిందని రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రంపై మాట్లాడడం కాకుండా రాష్ట్రంలో తాము చేసిందేందో చెప్పాలని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నియోజకవర్గం ఆర్థిక స్థితిగతుల్లో ఏలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. 119 నియోజకవర్గాల సమాన అభివృద్ధికి బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టుబడి పని చేశాయా అన్నది ప్రజల ముందు చెప్పాలన్నారు. గజ్వేల్ కు పాతాయన పాలనలో “గాడా” పెడితే, కొత్తయన పాలనలోకి వచ్చినాక కొడంగల్ కు “కూడా” పెట్టాడు తప్ప మిగతా నియోజకవర్గాల సమస్యలపై పట్టించుకున్న వారే లేరని ఆరోపించారు.
రాష్ట్రంలో బిజెపికి ఒక అవకాశం ఇచ్చి చూడండి అని ప్రజలను రఘునందన్ రావు కోరారు. స్థానిక సంస్థల్లో గెలుపు సాధిస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. గజ్వేల్ మున్సిపల్ వార్డులలో బిజెపి అభ్యర్థులంతా యువతరమేనని సమస్యల పరిష్కారం కోసం దగ్గరుండి చూసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సిద్దిపేట బిజెపి జిల్లా అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, బిజెపి నాయకులు గాడి పల్లి కళ్యాణి భాస్కర్, మనోహర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Maruti Suzuki Price Hike: కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్, ధరల పెంపు తప్పదా?