Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి టాలీవుడ్లో మంచి పేరు ఉంది. ఎక్కువగా కాంట్రవర్సీలు లేని హీరోలు దగ్గుబాటి ఫ్యామిలీలోనే కనిపిస్తారు. అలాంటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం అందరికీ షాకిస్తోంది. ఫ్యామిలీ బిజినెస్కు సంబంధించిన విషయంలో హైకోర్టు ఆదేశాలను దగ్గుబాటి ఫ్యామిలీ లెక్కచేయలేదని అందరిపై కేసు నమోదు అయ్యింది. వారిపై విచారణ జరపాలని కూడా నాంపలి కోర్టు ఆదేశించింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేయడంతో ముందుగా దగ్గుబాటి ఫ్యామిలీ (Daggubati Family)పై కేసు నమోదయ్యింది. ఇప్పుడు ఆ కేసు విషయంలో పూర్తి విచారణ జరపాలని ఫిలిం నగర్ పోలీసులకు నాంపలి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అక్రమంగా కూల్చివేత
దక్కన్ కిచెన్పై చాలాకాలం క్రితమే కేసు నమోదు అయ్యింది. సిటీ సివిల్ కోర్టులో ఈ కేసు పెండింగ్లో పడింది. ఆ సమయంలో దక్కన్ కిచెన్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దగ్గుబాటి ఫ్యామిలీని ఆదేశించింది హైకోర్టు. కానీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. వారు ఈ హోటల్ను కూల్చివేశారు. దీంతో ఇప్పుడు ఆ కేసు విషయంలో వారికి ఎదురుదెబ్బ తగిలింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఆదేశాలను పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నెంబరు కోర్టు.. ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారం శనివారం దగ్గుబాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆపై విచారణ చేపట్టారు.
Also Read: ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాట పాడిన వెంకటేశ్.. మామూలుగా ఉండదు మరి.!
అందరిపై కేసు
ఫిల్మ్ నగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ను అక్రమంగా కూల్చి వేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452, 458, 120 బి సెక్షన్లపై కేసు నమోదు చేశారు. గతంలో నంద కుమార్ అనే వ్యక్తికి దక్కన్ కిచెన్ హోటల్ విషయంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. అలా ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది. అలా 2022 నవంబరులో జిహెచ్ఎంసీ సిబ్బంది.. బౌన్సర్లతో కలిసి హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితిలో హోటల్ను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
ఏం జరిగిందంటే.?
పాక్షికంగా కూల్చివేసిన తర్వాత దక్కన్ కిచెన్ హోటల్పై ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా 2024 జనవరిలో హోటల్ను దగ్గుబాటి కుటుంబం పూర్తిగా కూల్చి వేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లగా వారిపై కేసు నమోదు చేయమని నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్లు తనకు అన్యాయం చేశారంటూ నందకుమార్ రెండేళ్లుగా కోర్టులో పోరాడుతున్నారు. శనివారం నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని .. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.