Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే. గత నాలుగు రోజులుగా దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. దిల్ రాజు సంపాదించినా అన్ని ఆస్తులకుసంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. దిల్ రాజు భార్యను బ్యాంక్ కూడా తీసుకెళ్లి సోదాలు చేశారు. మూడు రోజులు ఇంట్లో ఏమి దొరకలేదని, నాలుగో రోజు జరిగిన సోదాల్లో కొన్ని కోట్లు పట్టుబడ్డాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో నేడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ వార్తలు నిజం కాదని చెప్పుకొచ్చాడు.
“వ్యాపారాలు చేసేవారి ఇళ్లల్లో ఐటీ రైడ్స్ అనేవి కామన్గా జరుగుతుంటాయి. కానీ మీడియాలో కొందరు తెలిసీ తెలియక ఇష్టమొచ్చినట్టుగా వార్తలు రాశారు. ఖరీదైన డాక్యుమెంట్లు లభ్యం అయ్యాయని, కోట్ల రూపాయల నగదు లభ్యం అయ్యిందనే ప్రచారాలు చేశారు. కానీ అవన్నీ అవాస్తవాలే. మా అందరి దగ్గర కలిపి రూ.20 లక్షల నగదు మాత్రమే దొరికింది. వాటికి కూడా అన్నీ లెక్కలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ఇలా అన్నింటికి సంబంధించిన పత్రాలు అడిగారు. అన్నింటినీ చూపించాం. గత ఐదేళ్లలో మేము ఎలాంటి ఆస్తులను కొనుగోలు చేయలేదు. ఆ విషయాన్ని ఐటీ అధికారులకు తెలియజేశాం.ఐటీ రైడ్స్కి పూర్తిగా సహకరించాం. సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ అనేది లేదు” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఫేక్ కలక్షన్స్ ఇవ్వడం వలన ఇలాంటి దాడులు జరగడానికి అవకాశం ఉంది కదా.. దానిపై మీరేమంటారు అన్న ప్రశ్నకు దిల్ రాజు మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీలోని అందరం కలిసి దానిగురించి మాట్లాడాతాము. ఇది నేను పర్సనల్ గా నేను కామెంట్స్ చేయకూడదు. ఏమైనా ఉంటే ఇండస్ట్రీ నుంచి కరెక్ట్ చేయాల్సి ఉంది. దాదాపుగా ఎనభై శాతం మంది ఆడియన్స్ టిక్కెట్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. ఇక బ్లాక్మనీ ఎక్కడి నుండి వస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఫేక్ కలక్షన్స్ సమస్య ప్రేక్షకులను ఇబ్బంది పెడుతూనే ఉంది. సినిమా హిట్ కాకపోయినా.. మొదటి రోజు కలక్షన్స్ అని మేకర్స్.. తమ కిష్టమొచ్చిన నంబర్ ను ప్రింట్ చేసి పోస్టర్స్ వదులుతున్నారు. ఎందుకు ఇలా అంటే .. అది కేవలం ఫ్యాన్స్ ఆనందం కోసమే అని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఇలా ఫేక్ కలక్షన్స్ వలన సినిమాపై నెగిటివిటి పెరిగిపోతుంది. దీనికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని పలువురు సూచిస్తున్నారు. మరి దిల్ రాజు ఈ విషయమై ఎలాంటి చర్చలు జరుపుతాడో చూడాలి.