Game Changer:ఇటీవల జనవరి 4వ తేదీన రాజమండ్రిలో ఉన్న ఒక ఓపెన్ గ్రౌండ్లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా అభిమానులు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం విచ్చేశారు. ఇకపోతే ఈ సినిమా హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani) కూడా వస్తుందనుకున్నారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ప్రమోషన్స్ కి హాజరు కాలేదు. ఇక తర్వాత అంజలి(Anjali )కూడా తన వంతు అడుగు వేసి ప్రమోషన్స్ లో భాగమైంది. అంతేకాదు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజకీయాలలో అధికారం చేపట్టిన తర్వాత , ఈయన హాజరైన తొలి ఈవెంట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ పూర్తయిన తర్వాత అభిమానులు ఇంటికి చేరుకునే క్రమంలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించారు . ఇక వారికి దిల్ రాజు , పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్ కూడా ఆర్థిక సహాయం ప్రకటించినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
రోడ్డు ప్రమాదంలో అభిమానులు మృతి..
అసలు విషయంలోకి వెళ్తే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా శనివారం రోజు రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అని ఇద్దరు అభిమానులు హాజరయ్యారు. వాళ్ళిద్దరూ ఈవెంట్ తర్వాత బైక్ మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఇక దీంతో అభిమానుల మృతి పై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఎక్స్గ్రేషియా ప్రకటించిన హీరో..
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన సన్నిహితులను, తన మనుషులను పంపించి ధైర్యం కూడా చెప్పించారు రామ్ చరణ్. కుటుంబాలకు చెరొక రూ .5లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. దీనిపై రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాము. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా కోరుకునేది అదే. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధపడతాయో అర్థం చేసుకోగలను. నాకు అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను” అంటూ తెలిపారు రామ్ చరణ్. ఇకపోతే ఇప్పటికే చిత్ర నిర్మాత దిల్ రాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెరొక రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.