IT Raids at Sukumar House : నిన్నటి నుంచి టాలీవుడ్ లో చేస్తున్న ఐటీ సోదాలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. పలువురు బడా టాలీవుడ్ నిర్మాతల ఇళ్ల దగ్గర నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థలు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు చేయడం చర్చకు దారి తీసింది. నిర్మాతలు మాత్రమే కాదు పలువురు ఫైనాన్షియర్స్ పైన కూడా ఈ రైడ్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా ప్రొడ్యూసర్లు, ఫైనాన్షియర్ల వరకు మాత్రమే పరిమితమైన ఈ ఐటీ దాడులు తాజాగా డైరెక్టర్ల వరకు చేరుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ‘పుష్ప 2’ (Pushpa 2) డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఇంటి మీద కూడా ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ మంగళవారం ఉదయం సుకుమార్ ను ఎయిర్ పోర్ట్ నుంచి దగ్గరుండి మరీ నేరుగా ఇంటికి తీసుకెళ్లినట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఐటి అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప 2’ మూవీ నిర్మాణంలో తన బ్యానర్ ను భాగస్వామిగా చేయడమే సుకుమార్ పై ఈ రైడ్స్ కారణం అని తెలుస్తోంది.
టాలీవుడ్ ను టార్గెట్ చేయడానికి ఇదే కారణం…
ఇటీవల కాలంలో టాలీవుడ్ నిర్మాతలు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా తమ సినిమాలకు వస్తున్న కలెక్షన్లను అఫీషియల్ గా వెల్లడిస్తూ, ప్రేక్షకుల దృష్టిని సినిమా వైపుకు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రేక్షకుల దృష్టితో పాటు నిర్మాతలపై ఐటి అధికారుల దృష్టి కూడా పడింది. ఇంకేముంది ఫలితంగా ఐటి అధికారులు వరుసగా టాలీవుడ్ బడా నిర్మాతల ఇళ్లపై, ఆఫీసులపై మెరుపు దాడులు చేస్తున్నారు.
‘పుష్ప 2’ మూవీ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏకంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 1850 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ‘పుష్ప 2’ మూవీని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే మైత్రి మూవీస్ ఆఫీస్ పై అలాగే నిర్మాత నవీన్ యెర్నేని, సీఈవో చెర్రీ ఇళ్లపై ఐటీ అఫీషియల్స్ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుకుమార్ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘పుష్ప 2’తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఐటీ శాఖ టార్గెట్ చేస్తుండడం గమనార్హం.
ఐటీ రైడ్స్ జరిగిన ప్రముఖులు
ఇక ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఐటీ అధికారులు దిల్ రాజు ప్రొడక్షన్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్, మ్యాంగో మీడియాపై ఐటి రైడ్స్ జరిపింది. నిన్న రాత్రి ఏకంగా 2 గంటల వరకు నిర్మాత కిషోర్ గరికపాటి ఇంట్లో కూడా ఈ సోదాలు నిర్వహించారని బజ్ నడుస్తోంది. నిర్మాతలు మాత్రమే కాదు ఫైనాన్షియర్లు రిలయన్స్ శ్రీధర్, సత్య రంగయ్య వంటి వారిపై కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.