Naga Chaitanya- Shobhita: ఎట్టకేలకు నాగచైతన్య(Naga Chaitanya),శోభిత(Shobhita dhulipala)వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు..8:13 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ (ANR) విగ్రహం ముందు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ సెలబ్రిటీల నడుమ వీరి వివాహం చాలా ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. కొత్త జంటపై ఏఎన్ఆర్ ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతోనే ఇరు కుటుంబ సభ్యులు ఇక్కడ వివాహం నిర్వహించాలని అనుకున్నారట. అనుకున్నదే తడువుగా చైతన్య, శోభిత వివాహం తెలుగు బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. నాగచైతన్య శోభిత పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు కూడా విచ్చేశారు. అంతేకాదు ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా వివాహానికి హాజరయ్యారు.
అన్నపూర్ణ స్టూడియోలో సెలబ్రిటీల సందడి..
ముఖ్యంగా వీరి వివాహానికి కొంతమంది ప్రత్యేక అతిధులు కూడా హాజరైనట్లు సమాచారం. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, మహేష్ బాబు, నమ్రత, ప్రభాస్, ఎస్.ఎస్ రాజమౌళి,నయనతార దంపతులు, ఎన్టీఆర్ దంపతులు, పీవీ సింధు తో పాటూ దగ్గుబాటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే అన్నపూర్ణ స్టూడియో మొత్తం సెలబ్రిటీలతో సందడిగా సంబరంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.
వచ్చే ఏడాది అఖిల్ పెళ్లి..
ఇదిలా ఉండగా నాగచైతన్యతో పాటు ఆయన సోదరుడు ప్రముఖ హీరో అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. అఖిల్ నవంబర్ 26న ప్రముఖ వ్యాపారవేత్త కూతురైన జైనాబ్ రవ్డ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నాగార్జున ఇంట్లోనే ఈ వేడుక కూడా జరిగింది. వచ్చే ఏడాది వీరి వివాహం జరగబోతుందని సమాచారం. నిజానికి నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా ఒకే వేదికపై వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించగా.. దీనిపై స్పందించిన నాగార్జున అఖిల్ వివాహం వచ్చే ఏడాది ఉంటుంది, నాగచైతన్య వివాహం ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అన్నట్టుగానే తాజాగా అక్కినేని నాగచైతన్య, శోభిత ల వివాహం జరిపించారు.ఇకపోతే మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంటకు సంబంధించిన ఫోటోలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
భారీ బ్యాక్ గ్రౌండ్ వున్న అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్..
ఇకపోతే అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జైనాబ్ చిత్రకారిణి. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. ఈమె మన దేశంలోనే కాకుండా లండన్, దుబాయ్ వంటి ఇతర దేశాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ఈమె హైదరాబాదులో పుట్టి ముంబైలోనే స్థిరపడింది. ఇక జైనాబ్ తండ్రి జుల్ఫీ, నాగార్జునకు మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా వీరికి సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారీ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయితోనే అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నాగచైతన్య సినిమాలు..
ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తండేల్ సినిమాను విడుదల చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. గతంలోని వీరిద్దరి కాంబినేషన్లో ‘లవ్ స్టోరీ’ సినిమా రాగా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులు కూడా హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు.