Allu Arjun:తాజాగా జూబ్లీహిల్స్ లోని హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటిదగ్గర హై టెన్షన్ నెలకొంది. రేవతి మరణానికి కారణం అల్లు అర్జున్ అని, వారి కుటుంబానికి క్షమాపణలు చెబుతూ.. కోటి రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలి అని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. బెనిఫిట్ షోల వల్లే ఇలా జరిగిందని , రేవతి మరణించిందని, ఆమె కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అని, ఇప్పటికైనా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలి అంటూ ఓయూ JAC నాయకులు నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు ఓయూ JAC నాయకులు వారి కాంపౌండ్ లోపలికి వెళ్లి పూల కుండీలు ధ్వంసం చేశారు. రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టించారు. గోడలెక్కి టమోటాలు విసిరేసారు. ఇంటిముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరి ఈ సమయంలో అల్లు అర్జున్ కుటుంబం ఇంట్లో ఉన్నారా? లేరా? అన్న విషయం ఇంకా తెలియదు. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర మాత్రం పరిస్థితి చాలా ఉత్కంఠగా మారింది.
ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు..
ఒకవేళ అల్లు అర్జున్ కుటుంబం కనుక ఈ విషయంపై కేసు పెడితే వారి ఇంటి దగ్గర గొడవ చేస్తున్న ఓయూ JAC నాయకులపై పోలీసులు కేసు ఫైల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి బన్నీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తోనేనా..?
ఇకపోతే సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్దగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
బెనిఫిట్ షోలో వల్లే ప్రాణనష్టం..
అల్లు అర్జున్(Allu Arjun)- సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల అయ్యింది. అయితే ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్ కోసం డిసెంబర్ 4న బెనిఫిట్ షో వేశారు. అందులో భాగంగానే హైదరాబాదు లోని క్రాస్ రోడ్ లో వున్న సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ సినిమా చూడడానికి ర్యాలీ నిర్వహిస్తూ వచ్చారు. దీంతో అల్లు అర్జున్ ను చూడడానికి అభిమానులు ఎగబడగా తొక్కిసలాట జరిగింది.ఆ తొక్కిసలాటలో రేవతి (39) మరణించింది. ఆమె కుమారుడు శ్రీ తేజ (9) ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. శ్రీ తేజ చికిత్సకు కావలసిన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే అరేంజ్ చేసింది. ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తోంది. అయితే ఇంత జరిగినా.. అల్లు అర్జున్ ఈ కుటుంబం విషయంలో చొరవ తీసుకొని.. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకపోవడం వల్లే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఒక మనిషి చనిపోయింది. దీనికి తోడు తన సినిమా వల్లే చనిపోయిందనే విషయం తెలిసి కూడా బన్నీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేకపోతున్నారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి వీటన్నింటికి బన్నీ ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాలి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.