Theatre: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun), ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ‘పుష్ప 2’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాక ముందు రోజు.. అనగా డిసెంబర్ 4న బెనిఫిట్ షోలు వేయగా.. హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన అటు ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేసింది. ఇందులో రేవతి అనే మహిళ మరణించడమే కాకుండా ఆమె కొడుకు శ్రీ తేజ ఇప్పటికి ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలోని తెలంగాణ హైకోర్టు 16 సంవత్సరాల లోపు పిల్లలను ఉదయం 11 గంటల లోపు రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో సినిమా ప్రత్యేక ప్రదర్శనకు అనుమతించకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
పిల్లల అనుమతి నిషేధం పై హైకోర్టులో పిటిషన్..
అయితే ఇప్పుడు పిల్లలు సినిమా చూడడంపై నిషేధం విధించగా.. దానిని ఎత్తివేయాలని హైకోర్టును మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి వద్ద ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. టికెట్ల ధరలను సవాల్ చేస్తూనే పిటీషన్లు దాఖలు అయ్యాయని , పిల్ గా విచారణ చేపట్టడం ఏమాత్రం సరికాదని విన్నవించుకుంది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా మల్టీప్లెక్స్ లు తీవ్రంగా నష్టపోతున్నాయని, తన పిటీషన్ లో పేర్కొంది. ఇక దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. యూరప్ లో రాత్రి 11 గంటల తర్వాత సినిమా చూసేందుకు పిల్లలకు అనుమతి లేదు అని ఆయన చెప్పారు. ఇక దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేయడం జరిగింది. జనవరి 10న వేకువజామున నాలుగు గంటల నుండి 6 గంటల షోలకు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఇటీవల హైదరాబాద్ కి చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్ రాజ్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరి దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.
హైకోర్టు నిర్ణయం ఎటువైపు..
వాస్తవానికి పిల్లలు అర్థరాత్రి సమయంలో సినిమా చూడడం నిషేధం. ఎందుకంటే రాత్రులు సినిమా చూడడం వల్ల ఆ ప్రభావం పిల్లల ఆరోగ్యం పై పడుతుంది. ఫలితంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక హాలిడేస్ సమయంలో సినిమాలు డే టైంలో చూడొచ్చు. కానీ రాత్రిళ్ళు చూసే సినిమాల కారణంగా పిల్లల కంటిపై కూడా ప్రభావం పడుతుందని, అదే పిల్లల కంటి రెటీనాకి హాని కలిగిస్తుందని కూడా వైద్యులు తెలియజేసిన విషయం తెలిసిందే.మరి పిల్లల ఆరోగ్య విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఉత్తర్వుల జారీ చేసింది. కానీ ఇప్పుడేమో మల్టీప్లెక్స్ థియేటర్ ఓనర్లు తమకు నష్టం వాటిల్లుతోందని, పిల్లలు కూడా సినిమా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల గురించి ఆలోచించకుండా సొంత లాభార్జన గురించి ఆలోచిస్తున్న మల్టీప్లెక్స్ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి తీర్పుని ఇస్తుందో చూడాలి.