Jagan Angry: వైసీపీ అధినేత జగన్ మరిన్ని కష్టాలు రెట్టింపు అయ్యాయి. గడిచిన ఐదేళ్లు భారీ భద్రత మధ్య ఉండేవారు. భద్రత లేకుండా ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ భద్రత కోసమే ప్రతిపక్ష హోదా కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారాయన. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం ఇదే విషయాన్ని మీడియా ముఖంగా చెప్పారు. కావాల్సిన సంఖ్యబలం లేకుంటే హోదా ఇలా ఇస్తారని అన్నారు.
భద్రత ఏది?
తాజాగా గుంటూరు మిర్చియార్డులో రైతులతో మాట్లాడారు మాజీ సీఎం జగన్. వారి సమస్యలు తెలుసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారాయన. ఈ సందర్భంగా కీలక విషయాలు బయటపెట్టారు. తాను గుంటూరుకు వస్తున్నాని తెలిసి కనీసం పోలీసు భద్రత కూడా ఇవ్వలేదన్నారు. రేపటి రోజు తాము అధికారంలోకి వచ్చాక ఇలాగే జరుగుతుందని, పోలీసు భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు.
మీ ప్రభుత్వం కంటిన్యూగా ఉండదని, ప్రస్తుతం మీరు చేస్తుంది కరెక్టో కాదో మీరే ఆలోచించుకోవాలన్నారు మాజీ సీఎం. విచిత్రం ఏంటంటే.. గుంటూరుకు వెళ్తున్నట్లు ఆ జిల్లా అధికారులకు వైసీపీ నాయకత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అలాగే ఈసీకి కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మాజీ సీఎంగా జగన్కు ఉండాల్సిన భద్రతను పోలీసులు కల్పించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
సీఎం స్థాయిలో భద్రత కావాలంటే ఎలాగని అంటున్నారు అధికారులు. అయినా మాజీ సీఎం ఎక్కడకు వెళ్తున్నారో సమాచారం ఇవ్వకుంటే భద్రత ఎలా ఇస్తామని అంటున్నారు. ఈ క్రమంలో రైతుల సమస్యల గురించి మాట్లాడారు జగన్. ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేరన్నారు. ఈ పరిస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమన్నారు. గుంటూరు మిర్చి రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు.
ALSO READ: హస్తినకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
రైతులు చిక్కిపోయారు?
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇక వైసీపీ పాలన గురించి చెప్పుకునే ప్రయత్నం చేశారు మాజీ సీఎం. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచామని వివరించారు.
వైసీపీ హయాంలో రైతే రాజని, కూటమి ప్రభుత్వం వారిని దగా చేసిందన్నారు. పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదని, రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొందన్నారు. మిర్చి రైతుల అవస్థలను చంద్రబాబు సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గిందన్నారు. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందన్నారు.
అప్పుడు లేని కోడ్ ఇప్పుడెలా వచ్చింది?
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి మిర్చి యార్డు రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు రియాక్టు అయ్యారు. వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జైలుకి వెళ్లినప్పడు లేని కోడ్ ఉల్లంఘన, ఇప్పుడెలా వచ్చిందన్నారు.
రైతులను బాధను తెలుసుకునేందుకు వస్తే కోడ్ గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. ఇదంతా మంత్రి లోకేష్ ఆడిస్తున్న డ్రామా వర్ణించారాయన. జగన్ పర్యటనను డ్రోన్ తో చిత్రీకరించారు పోలీసులు. ఈ లెక్కన రేపో మాపో ఆయనకు ఈసీ నోటీసులు ఇవ్వడం ఖాయమని అంటున్నారు.
నేను గుంటూరుకు వస్తున్నాని తెలిసి కనీసం పోలీస్ భద్రత కూడా ఇవ్వలేదు : వైఎస్ జగన్
రేపు మేము అధికారంలోకి వచ్చాక కూడా ఇలాగే పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి
ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు
మీరు చేస్తుంది కరెక్టో కాదో మీరే ఆలోచించుకోండి
– వైఎస్ జగన్ pic.twitter.com/XkmFCGuZRw
— BIG TV Breaking News (@bigtvtelugu) February 19, 2025