RRR: నాటు నాటుకు ఆస్కార్తో భారతీయ సినీ పరిశ్రమ పండగ చేసుకుంటోంది. టాలీవుడ్ సంబరాల్లో మునిగి తేలింది. తెలుగుజాతి నిండుగర్వంతో ఉప్పొంగిపోతోంది. కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి, రామ్చరణ్, తారక్, రాహుల్, కాలభైరవలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్కార్ అవార్డు.. హాలీవుడ్పై RRR జెండాను ఎగరేసింది.
అంతా బాగుంది కానీ.. ఒక్కటే చిన్న మచ్చ. టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన విమర్శ మరకలా అంటుకుంది. ఆస్కార్ కోసం RRR టీమ్ 80 కోట్ల వరకూ భారీగా ఖర్చు చేసిందని.. ఆ బడ్జెట్తో అనేక చిన్న సినిమాలు తీయొచ్చని అనడం కలకలం రేపింది. తమ్మారెడ్డికి నాగబాబు లాంటి వాళ్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నాటు నాటుకు ఆస్కార్ రావడంతో.. ఆ విషయం మరుగున పడిపోయింది.
లేటెస్ట్గా.. RRR నిర్మాత డీవీవీ దానయ్య ఓ ఇంటర్యూలో ఆస్కార్ ప్రమోషన్ కోసం పెట్టిన ఖర్చుపై స్పందించారు. ఆస్కార్ ఈవెంట్కు నిర్మాత దానయ్య హాజరుకాకపోవడంపైనా రూమర్స్ వచ్చాయి. రాజమౌళి ఆయన్ను పక్కనపెట్టేశారంటూ ప్రచారం చేశారు. వీటన్నిటిపైనా క్లారిటీ ఇచ్చారు డీవీవీ దానయ్య.
ఆస్కార్ అవార్డు వేడుకకు రాజమౌళి తనను దూరంగా పెట్టాడనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. జక్కన్న అలాంటి వ్యక్తి కానే కాదన్నారు. సింపుల్గా ఉండటమే తనకు ఇష్టమని.. ఆర్బాటాలు తనకు నచ్చవని.. అందుకే తానే ఆస్కార్ వేడుకకు వెళ్లలేదని చెప్పారు. RRR సినిమాతో తనకు మంచి పేరు రావాలని భావించానని.. అది వచ్చింది.. నాకది చాలంటూ వివరణ ఇచ్చారు దానయ్య.
ఇక, ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారనే ఆరోపణపైనా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారాయన. ఆస్కార్ ప్రమోషన్ కోసం తానైతే ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టలేదని చెప్పేశారు. ఒకవేళ రాజమౌళి ఏమైనా ఖర్చు చేసి ఉంటే ఆ విషయం మాత్రం తనకు తెలీదంటూ వివరించారు. ఆస్కార్ కోసం 80 కోట్ల ఖర్చు పెట్టే అవకాశమే లేదన్నారు. సినిమాకే అంత లాభం ఉండదు.. అలాంటిది 80 కోట్లు ఖర్చు పెట్టడం ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నించారు RRR నిర్మాత డీవీవీ దానయ్య.