SSMB 29: ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా దానికి రెండు భాగాలు ఉంటాయని ముందుగానే అనౌన్స్ చేసేస్తున్నారు మేకర్స్. రెండు లేదా మూడు భాగాలతో ఒక సినిమాను ఫ్రాంచైజ్లాగా చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్లాగా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో ఒక పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుంది అంటే అది కచ్చితంగా రెండు భాగాల్లో విడుదల కావాల్సిందే అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. దీనినే సక్సెస్ ఫార్ములాగా కూడా భావిస్తున్నారు మేకర్స్. అసలైతే ఈ సక్సెస్ ఫార్ములాను స్టార్ట్ చేసిందే రాజమౌళి. ‘బాహుబలి’తో తను ప్రారంభించిన ట్రెండ్ను ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా ఫాలో అవుతున్నారు. దీంతో రాజమౌళి ఇప్పుడు ఈ సక్సెస్ ఫార్ములాకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట.
‘బాహుబలి’ రికార్డ్
అసలు తెలుగు నుండి భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కగలవా.? ఒక తెలుగు సినిమాకు రూ.100 కోట్ల కలెక్షన్ వస్తుందా, పాన్ ఇండియా అనే ట్యాగ్ సాధ్యమా.? ఒకప్పుడు మూవీ లవర్స్లో ఇలాంటి సందేహాలు ఉన్నాయన్నది నిజం. కానీ ఒక్కసారిగా ఆ సందేహాలు అన్నింటికి ‘బాహుబలి’తో సమాధానమిచ్చారు రాజమౌళి. ఒక తెలుగు సినిమా మునుపెన్నడూ పెట్టనంత బడ్జెట్ను పెట్టి ‘బాహుబలి’ తెరకెక్కిస్తున్న సమయంలో రాజమౌళి స్ట్రాటజీని అందరూ అనుమానించారు. కానీ అదే మూవీ తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది. అంతే కాకుండా ఇప్పటికీ ఈ మూవీ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఇతర సినిమాలు బ్రేక్ చేయలేకపోయాయి.
‘ఆర్ఆర్ఆర్’ తరహాలోనే
‘బాహుబలి’తో ఆగకుండా ఆ కథ ఇంకా పూర్తి కాలేదు అంటూ ‘బాహుబలి 2’ను తెరకెక్కించారు రాజమౌళి. అలా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత హిట్ అందుకుంది. దీంతో పాన్ ఇండియా సినిమా అంటే రెండు భాగాలుగా తెరకెక్కిస్తే పక్కా హిట్ అవుతుందని నమ్మడం మొదలుపెట్టారు మేకర్స్. అలా సౌత్ నుండి విడుదలయిన ఎన్నో పాన్ ఇండియా సినిమాలు రెండు భాగాలుగానే తెరకెక్కి హిట్ కొట్టాయి. కానీ రాజమౌళి మాత్రం ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ను ఒక్క పార్ట్తోనే ముగించాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తున్న ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ విషయంలో కూడా అదే జరగనుందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: తారక్ తీరని కోరిక.. చచ్చిపోయి.. మళ్లీ పుట్టి తీర్చుకుంటాడట
అప్డేట్స్ లేవు
మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో సినిమా అనగానే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ బయటికి రాకపోయినా ఇప్పటికే దీనిపై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ పెరిగిపోయింది. ఇందులో మహేశ్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుందన్న విషయం మాత్రమే ఇప్పటికి కన్ఫర్మ్ అయ్యింది. అంతే కాకుండా మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. అయితే మొదట్లో ఈ మూవీ మూడు భాగాలుగా విడుదల కానుందని టాక్ వచ్చినా.. ఇప్పుడు కేవలం ఒక్క పార్ట్తోనే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (SSMB 29)ను ముగించాలని ఫిక్స్ అయ్యారట రాజమౌళి.