Instagram Influencer Murder: సోషల్ మీడియా పరిచయాలు, వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో ఎలా చిచ్చు పెడుతున్నాయో చెప్పడానికి రాజస్థాన్లో జరిగిన ఈ ఘోర ఉదంతమే ఉదాహరణ. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చింది.
Read also-సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. స్టార్ హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు!
రాజస్థాన్లోని బాడ్మేర్ జిల్లా గరల్ గ్రామానికి చెందిన తేజారామ్ (42) భవన నిర్మాణ కార్మికుడు. అతని భార్య నేతల్ (36) ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ దాదాపు 42,000 మంది ఫాలోవర్లతో ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఆమెకు గుమన్సింగ్ (30) అనే టాక్సీ డ్రైవర్తో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త పనిమీద బయటకు వెళ్లినప్పుడు వీరిద్దరూ కలుసుకునేవారు. ఈ విషయం తేజారామ్కు తెలియడంతో భార్యను తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో అతడిని వదిలించుకోవాలని నేతల్ ప్లాన్ చేసింది.
జూన్ 2న నేతల్ తన భర్తకు ఫోన్ చేసి, ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆందోళనతో భార్య కోసం వెతుకుతున్న తేజారామ్ను గుమన్సింగ్ నమ్మించి ధోరిమన్న ప్రాంతానికి రప్పించాడు. అక్కడ అతనికి విపరీతంగా మద్యం తాగించి స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం తన టాక్సీలో 30 కిలోమీటర్ల దూరంలోని ఒక నిర్మానుష్య పొలానికి తరలించి, అక్కడ ఉన్న నీటి ట్యాంకులో తేజారామ్ను పడేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఇద్దరూ పరారయ్యారు.
Read also-కియా కస్టమర్లకు షాక్.. జూలై 1 నుంచి అన్ని మోడల్స్ ధరలు పెంపు!
జూన్ 4న నీటి ట్యాంకులో మృతదేహాన్ని చూసిన పొలం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాడ్మేర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడి కాల్ డేటా రికార్డులను (CDR) పరిశీలించగా, చివరిగా భార్య నేతల్, గుమన్సింగ్లతో మాట్లాడినట్లు తేలింది. టెక్నికల్ ఆధారాలతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా పాపం పండి నిజం ఒప్పుకున్నారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.