Smart AC Controller: జూన్ నెల వచ్చినా ఎండలు మండిపోతుండటంతో ఇళ్లలో, ఆఫీసుల్లో ఏసీల వాడకం ఇంకా కొనసాగుతోంది. అయితే ఏసీ సౌకర్యాన్ని వదులుకోలేక, బిల్లులను భరించలేక చాలా మంది సతమతమవుతున్నారు. అలాంటి వారికి టెక్నాలజీ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతోంది. ఒక స్మార్ట్ టెంపరేచర్ సెన్సార్, వై-ఫై రిమోట్ (స్మార్ట్ ఏసీ కంట్రోలర్)లను మీ పాత ఏసీకి జత చేయడం ద్వారా కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసి నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి వేళ గది చాలా చల్లగా మారిపోతుంది. ఆ సమయంలో ఏసీని ఆపడమో లేదా టెంపరేచర్ పెంచడమో చేయాలి. కానీ నిద్రలో అది గమనించక పోవడం వల్ల ఏసీ అనవసరంగా రన్ అవుతూ కరెంట్ బిల్లును పెంచేస్తుంది. అదే స్మార్ట్ టెంపరేచర్ సెన్సార్ ఉంటే అది గదిలోని ఉష్ణోగ్రతను నిరంతరం గమనిస్తూ ఉంటుందని నిపుణులు అంటున్నారు. గది తగినంత చల్లగా అవ్వగానే కంప్రెసర్ను ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తుందని పేర్కొంటున్నారు. దీనివల్ల విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
చాలామంది ఆఫీసులకు లేదా బయటకు వెళ్లేటప్పుడు హడావుడిలో ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. ఇలాంటి సమయాల్లో వై-ఫై రిమోట్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మొబైల్ యాప్ ద్వారా ఇంట్లోని ఏసీని ఆఫ్ చేసే వెసులుబాటును ఇది కల్పిస్తుంది. అలాగే మీరు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఉండగానే ఏసీ ఆన్ చేసుకుంటే మీరు వచ్చేసరికి గది చల్లగా మారిపోతుంది.
మీరు వాడేది పాత మోడల్ (నాన్-ఇన్వర్టర్) ఏసీ అయినా సరే ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లను అమర్చడం ద్వారా అది ఇన్వర్టర్ ఏసీ లాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. రూమ్ టెంపరేచర్ను బట్టి ఈ సెన్సార్లు ఏసీ పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. దీనివల్ల కంప్రెసర్పై పడే లోడ్ తగ్గి, ఏసీ జీవితకాలం పెరగడమే కాకుండా 20% నుండి 30% వరకు కరెంట్ బిల్లు ఆదా అవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.
Also Read: ఒకే ధర.. భిన్నమైన లాభాలు.. జియో, వీఐ రూ.3599 ప్లాన్లలో ఏది బెస్ట్?
ఈ వై-ఫై ఆధారిత సిస్టమ్స్ ద్వారా మీరు నిర్దిష్ట సమయాలకు ఏసీ ఆన్/ఆఫ్ అయ్యేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రాత్రి 11 గంటలకు ఏసీ ఆన్ అయి, ఉదయం 5 గంటలకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయేలా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా కరెంట్ బిల్లును ఆదా చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మార్కెట్లో మార్కెట్లో ఈ స్మార్ట్ వై-ఫై రిమోట్లు, సెన్సార్లు కేవలం రూ. 1,000 నుండి రూ. 2,500 లోపే లభిస్తున్నాయని తెలియజేస్తున్నారు. ఒక్కసారి ఈ చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే ప్రతి నెల వచ్చే వేల రూపాయల ఏసీ బిల్లుల నుండి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చని వివరిస్తున్నారు.
Also Read: సామాన్యుల ప్లాన్.. రూ.249కే 35 రోజుల వ్యాలిడిటీ.. రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!