Rana Daggubati:ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ గురించి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు సెలబ్రిటీలు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు వారందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే రానా దగ్గుబాటి (Rana Daggubati)కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు అంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. దీంతో ఆయన విచారణకు రావాలి అని అరెస్టు తప్పదని కొంతమంది కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా రానా దగ్గుబాటి పీఆర్ టీం స్పందించింది.
బెట్టింగ్ యాప్ కేస్ పై స్పందించిన రానా దగ్గుబాటి టీమ్..
ఇదిలా ఉండగా ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి . ఈ కేసుకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. మరి కొంతమంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేయడం పై వివరణ ఇస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు రానా దగ్గుబాటి టీం కూడా స్పందించింది.. నైపుణ్యం ఆధారిత గేమ్లకు మాత్రమే రానా దగ్గుబాటి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి, ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గడువు 2017 లోనే ముగిసిపోయింది. ఆన్లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్లను చట్టబద్ధంగా అనుమతించిన వాటికే అప్పుడు రానా ఆమోదం తెలిపారు. ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయబృందం అన్ని భాగస్వామ్యాలను క్షుణ్ణంగా సమీక్షించి, చట్టపరమైన సమీక్ష తర్వాతే చట్టానికి అనుగుణంగా ఉండేలా ఆ ఫ్లాట్ ఫామ్ ను అంగీకరించాడు. ముఖ్యంగా రాణా దగ్గుబాటి నైపుణ్యం ఆధారిత గేమింగ్ ఫ్లాట్ ఫామ్ ను ఆమోదించడం చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికి,ఈ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేస్తున్నాం.ముఖ్యంగా జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్లైన్ గేమ్లను హైలెట్ చేయడం ఎంతో అవసరం. ఈ గేమ్లు అవకాశం మీద కాకుండా నైపుణ్య మీద ఆధారపడి ఉంటాయి. అందువల్లే చట్టబద్ధంగా కోర్టు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది ” అంటూ టీం క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే రానా దగ్గుబాటి టీం స్పందించి పలు రూమర్స్ కి చెక్ పెట్టారు.
మియాపూర్ పీఎస్ పరిధిలో 25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్..
ఇకపోతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 25 మంది సినీ ప్రముఖులపై కేసులు నమోదు కాగా.. అందులో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి , నిధి అగర్వాల్ తదితర సినీ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ , ప్రకాష్ రాజ్ ఈ అంశాలపై క్లారిటీ ఇస్తూ వివరణ ఇవ్వగా.. ఇప్పుడు రానా దగ్గుబాటి టీం కూడా వివరణ ఇచ్చింది.