Saleshwaram Temple: హిమాలయాల్లోని అమర్నాథ్ యాత్ర ఎంత కష్టంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.ఇదిగో మన తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల అడవుల్లో కొలువు దిరీన ‘సలేశ్వర క్షేత్రం’యాత్ర కూడా అంతే.అందుకే నాగర్ కర్నూలు జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రాన్ని”తెలంగాణ అమర్నాథ్”అని పిలుస్తారు.మరి చుట్టూ ఎత్తైన కొండలు.. లోతైన లోయలు,ఎటు చూసినా క్రూర మృగాల మధ్యలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ప్రత్యేకతలు ఏంటో చూద్దామా!
స్వయంభూగా కొలువైన లింగమయ్య స్వామి
హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహలో మంచు లింగం ఎలా వెలుస్తుందో.. ఇక్కడ నల్లమల లోయలోని గుహలో లింగమయ్య స్వామి కూడా అలాగే స్వయంభూగా కొలువై ఉండటం ఇక్కడ విశేషం.అందుకే భక్తులు దీన్ని “దక్షిణ అమర్నాథ్” లేదా “తెలంగాణ అమర్నాథ్” అని భక్తితో పిలుచుకుంటారు. అయితే, ఈ ఆలయం చుట్టూ క్రూర మృగాలు, పెద్ద పులులు, భారీ నాగపాములు రక్షణగా ఉంటాయని అందుకే ఏడాదిలో కేవలం మూడు రోజులు (చైత్ర పౌర్ణమి సమయం) మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని ఇక్కడి ఆదివాసీల నమ్మకం.
300 మీటర్ల పైనుంచి పడే నీటి దారలు
ఇక ఈ సలేశ్వరం లోయలోకి అడుగుపెట్టగానే పలకరించే జలపాతం ఓ మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.ముఖ్యంగా సుమారు 300 మీటర్ల పైనుంచి పడే నీటి దారలు నేరుగా స్వామివారి లింగాకారానికి ఎదురుగా జాలువారుతూ ఉంటుంది.అక్కడి నుండి ఈ నీరు వందల అరుదైన అడవి మూలికల గుండా ప్రవహిస్తూ వస్తుందని అందుకే ఈ నీటిని తాగినా, ఇందులో స్నానం చేసినా దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
చెంచులే ఇక్కడ బ్రాహ్మణ పూజారులు
ఈ క్షేత్రం ప్రాచీన ఆదివాసీ సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ ఎలాంటి ఆడంబరాలు ఉండవు,ఇకబ్రాహ్మణ పూజారులు అసలే ఉండరు, తరతరాలుగా ఈ అడవిని నమ్ముకున్న చెంచులే ఇక్కడ పూజలు చేయడం,వారి సంప్రదాయం ప్రకారమే జాతర సాగడం ఇక్కడ విశేషం.ఇక ఆ లింగమయ్య స్వామికి అడవిలో దొరికే పండ్లు,’ఇప్ప పూలను’ ప్రసాదంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత.
చైత్ర పౌర్ణమి రోజున భక్తులతో కిటకిట
ఈ క్షేత్రానికి చేరాలంటే రాళ్లు రప్పలు, ఎత్తైన కొండలు, జారిపోయే లోయల మధ్య కిలోమీటర్ల కొద్ది నడవాలి,ఒకరకంగా సలేశ్వరం వెళ్లడం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లడమే. అయితే ముఖ్యంగా చైత్ర పౌర్ణమి రోజున ఈ నిశ్శబ్దమైన అడివి భక్తులతో కిటకిటలాడుతుంది. లక్షలాది మంది భక్తులు “లింగమయ్యా.. కాపాడు” అంటూ చేసే నామస్మరణతో కొండలు ప్రతిద్వనిస్తాయి.ఇక అడవిలో సౌకర్యాలు లేకపోయినా, ప్రాణాలకు తెగించి భక్తులు ఈ యాత్రకు వస్తారంటే ఇక్కడి స్వామివారి మహిమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
సలేశ్వరం ఒక అద్భుతమైన డెస్టినేషన్
అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అన్నింటిలా మాములు టూర్ కాదు.హెల్తీ గా, ఫిట్ గా ఉన్నవాళ్ళు మాత్రమే మాత్రమే వెళ్లడం ఉత్తమం.అందుకే చిన్న పిల్లలు, వృద్ధులు ఈ యాత్రకు రాకపోవడమే మంచిదని చెబుతుంటారు.ఇక అటవీ శాఖ అనుమతించిన ఆ మూడు రోజుల్లోనే వెళ్లాలి.అది కూడా ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా.ఇక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం మొబైల్ సిగ్నల్స్ అసలు ఉండవు.అంటే అడవిలోకి వెళ్తే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయన్న మాట.ఏది ఏమైనా ప్రకృతి ఒడిలో పరమశివుడిని దర్శించుకోవాలనుకునే వారికి సలేశ్వరం ఒక అద్భుతమైన డెస్టినేషన్ అనే చెప్పాలి.ఆ జలపాతం శబ్దం,కొండల మధ్య చల్లని గాలి, లింగమయ్య దర్శనం.. మీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మిగల్చడం ఖాయం !