Chhaava : విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక మందన్న (Rashmiak Mandanna) జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛావా’ (Chhaava). ఛత్రపతి మహారాజ్ శివాజీ వారసుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ కాగా, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా మూవీపై ప్రశంసలు వర్షం కురుస్తుంటే, మరోవైపు షిర్కే వారసులు మాత్రం మూవీపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్ పై ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
వివాదం ఏంటంటే?
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో శంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్, మరాఠా మహారాణి యేసు బాయిగా రష్మిక మందన్న నటించిన మూవీ ‘ఛావా’. అయితే యేసు బాయి పుట్టింటి వారైన షిర్కే వారసులు పూణే గనోజీ, కన్హోజీ షిర్కే ‘ఛావా’ మూవీపై అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ చిత్రంలో తమ కుటుంబాన్ని చిత్రీకరించే ముందు మేకర్స్ తమను సంప్రదించలేదని ఆరోపించారు. అంతేకాకుండా తమ పూర్వీకులను సినిమాలో నెగిటివ్ గా చిత్రీకరించారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించాలని వాదిస్తున్నారు.
సినిమాలో షిర్కే కుటుంబాన్ని విలన్ గా చూపించారని, వాస్తవానికి వాళ్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ కు విధేయులుగా ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు షిర్కే వారసులు మాట్లాడుతూ “చారిత్రక వాస్తవాలను ఛావా మూవీలో తప్పుగా చూపించారు. ఇది మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కాబట్టి మేము మూవీ డైరెక్టర్ కి లీగల్ నోటీసు జారీ చేసాం. అతనిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాము” అని అన్నారు. గనోజి, కన్హోజి షిర్కే ల 13వ వారసుడు లక్ష్మీకాంత్ రాజే షిర్కే ఈ కామెంట్స్ చేశారు.
‘ఛావా’ దర్శకుడికి నోటీసులు
ఫిబ్రవరి 20న లక్ష్మీకాంత్ రాజే షిర్కే డైరెక్టర్ కు నోటీసును జారీ చేసి, సినిమాలో తాము అభ్యంతరం వ్యక్తం చేసిన సీన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అవసరమైన మార్పులు చేసి, మూవీని రిలీజ్ చేయాలని, ఒకవేళ తమ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
అదే రోజు నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ షిర్కే వారసులు, బంధువులు పూణే నగర పోలీస్ కమిషనరేట్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. లక్ష్మి కాంత్ రాజేష్ షిర్కే ప్రకారం గనోజి, కన్హోజీ షిర్కే మొఘలులతో శంభు రాజే గురించి పంచుకున్న సమాచారానికి సంబంధించిన పత్రాలు కోరుతూ 2009లో డైరెక్టరేట్ ఆఫ్ ఆర్కైవ్స్లో ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేదా డాక్యుమెంట్స్ దొరకలేదని ఆయన అన్నారు.
చారిత్రాత్మక సినిమాలను సరైన విధంగా పరిశోధన చేసి, కీలకమైన వారి వారసులను సంప్రదించి నిర్మించాలని షిర్కే కుటుంబం పట్టుబడుతుంది. మరి ఈ వివాదంపై డైరెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు మూవీ 300 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి, అదే జోష్ తో దూసుకెళ్తోంది. తాజాగా పీఎం నరేంద్ర మోడీ సైతం మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు.