Suhasini.. తెలుగు సినిమా పరిశ్రమలో సహజత్వానికి మారుపేరుగా నిలిచిన ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని (Suhasini)తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. ప్రస్తుత హీరోయిన్లకు దర్శకులు ఇస్తున్న పాత్రల గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
వాస్తవానికి మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా హీరోల పాత్రలే హైలెట్ అవుతాయి. హీరో ఇమేజ్ పైనే సినిమా నడుస్తుంది కాబట్టే హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అని అందరూ కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా నిన్న మొన్నటి వరకే.. ఒకప్పుడు 4 పాటలు , 2 రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితమైన హీరోయిన్లు ఇప్పుడు తమ పరిధిని దాటి బయటకొస్తూ పాత్ర ఏదైనా సరే తాము నటిస్తామని ముందడుగు వేస్తున్నారు. అటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు ఇటు యాక్షన్స్ సన్నివేశాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు. ఆఖరికి వేశ్య పాత్రలే కాదు బెడ్రూమ్ సన్నివేశాలు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. అయితే హీరోయిన్లు ఎంతగా తమను తాము ప్రూవ్ చేసుకోవాలని చూసినప్పటికీ.. హీరోతో పోటీ పడే పాత్రలైతే రావు అన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్లను ఉద్దేశించి.. వారి కొచ్చే పాత్రల గురించి సీనియర్ నటి సుహాసిని సంచలన కామెంట్లు చేశారు.
హీరోయిన్స్ పాత్రలకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు..
సుహాసిని మాట్లాడుతూ.. పాశ్చాత్య పోకడలను అవలంబించడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అందుకే స్కిన్ షో , ఇంటిమేట్ సీన్లలో నటించడానికి కూడా వారు వెనుకడుగు వేయడం లేదు. గతంలో ఇలాంటి సీన్లు చేయాలి అంటే హీరోయిన్స్ ఎంతో ఆలోచించేవారు. అయితే ఆ కాలంలో కూడా ఇలాంటి గ్లామర్ షోలు చేసేవారు ఉండేవారు కానీ చాలా తక్కువ. అయితే ఇప్పుడు అలా కాదు. ఎలా ఉన్నా సరే సన్నివేశంలో నటించడానికి సిద్ధం అయిపోతున్నారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కొంతమంది దర్శకులు.. భావ ప్రకటన పేరుతో మహిళల పాత్రలని తక్కువ చేసి చూపిస్తున్నారు. హీరోలకు బలమైన పాత్రలు రాస్తున్నారే కానీ హీరోయిన్ల పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ ఆమె తెలిపింది. ఒకరకంగా చెప్పాలి అంటే హీరోయిన్స్ కి ఇండస్ట్రీలో గుర్తింపు లేదు అంటూ బోల్డ్ కామెంట్ చేసింది సుహాసిని. ప్రస్తుతం సుహాసిని చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
హీరోయిన్స్ క్యారెక్టర్స్ పై గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా గతంలో కూడా చాలామంది హీరోయిన్లు తమకు ప్రాధాన్యత ఉండే క్యారెక్టర్లు ఇవ్వడం లేదని కేవలం హీరో పక్కన హీరోయిన్ ఉండాలి కాబట్టే అలాంటి పాత్రలు ఇస్తున్నారని ఎంతోమంది వాపోయారు. ఇప్పుడు సీనియర్ నటి సుహాసిని కూడా ఇలాంటి కామెంట్లు చేయడంతో ఇది నిజమే అని అందరూ భావిస్తున్నారు.. ఏది ఏమైనా హీరోయిన్ల పాత్రల విషయంలో, వాళ్లకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడడం ఆసక్తికరంగా మారింది.
వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి అదే కారణం..
ఇక సుహాసిని తన భర్త మణిరత్నం (Maniratnam) గురించి కూడా మాట్లాడుతూ.. మాది పెద్దలు కుదిర్చిన వివాహం అని ఆమె తెలిపింది. మా ఇద్దరి మధ్య ఇష్టాలు, అభిప్రాయాలు, వృత్తి ఇలా ప్రతి విషయంలో కూడా మేము ఒకరిని ఒకరు గౌరవించుకుంటాము. మా మధ్య ఎప్పుడూ కూడా గొడవలు రావు. ఒకవేళ వచ్చినా వెంటనే సర్దుకుపోతాము. ఇదే మా వైవాహిక జీవితం సవ్యంగా సాగడానికి కారణం అంటూ సుహాసిని తెలిపింది.