Gaddar:గద్దర్ అంటే కేవలం ఒక పేరు కాదు, అణచివేతపై ఎక్కుపెట్టిన బాణం. ఎర్ర తువాలు భుజాన వేసి, చేతిలో కర్ర పట్టి, కాలికి గజ్జె కట్టి ఆయన ఆడుతుంటే.. అది ఒక ప్రదర్శనలా కాక, ఒక సామాజిక విప్లవంలా కనిపించేది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘పొడుస్తున్న పొద్దుమీద నడవడమా.. పోరు తెలంగాణా’ అంటూ ఆయన పాడిన పాట కోట్లాది మందిలో ఉద్యమ కాంక్షను రగిలించింది. అట్టడుగు వర్గాల గొంతుకై, పాలకులు గుండెల్లో నిదురపోయిన ప్రజా యుద్ధనౌక ఆయన. కేవలం పాటలతోనే కాకుండా, తన ఆవేదనను ఆశయంగా మార్చి సామాజిక అన్యాయాలపై ఆయన చేసిన పోరాటం అజరామరం.
కళ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది సామాజిక మార్పుకు ఆయుధం అని గద్దర్ నిరూపించారు. అందుకే, తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలను సమున్నత రీతిలో గౌరవించాలని నిర్ణయించింది. గతంలో ఉన్న ‘నంది’ అవార్డుల పేరును ‘గద్దర్ అవార్డులు’గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. ఒక ప్రజా కళాకారుడి పేరు మీద రాష్ట్రస్థాయి అవార్డులను నెలకొల్పడం అంటే.. అది ఆయన పాటకు, ఆయన పడ్డ శ్రమకు దక్కిన నీరాజనం. సమైక్య పాలకుల వివక్షను ఎదిరించి, తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన గద్దర్ పేరు ఇకపై ప్రతి ఏటా ఉత్తమ కళాకారులకు ఇచ్చే పురస్కారాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ALSO READ:Devagudi: దేవగుడి టీం బరితెగింపు.. పబ్లిసిటీ కోసం పిల్లల మీద ప్రయోగాలా?
గద్దర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన వదిలి వెళ్ళిన పాటల వారసత్వం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఆయన రాగమే తెలంగాణ ఆకాంక్షలకు స్ఫూర్తి గా మారి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. నేడు ఆయన 77వ జయంతి సందర్భంగా, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఇచ్చే నిజమైన నివాళి. గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు, అన్యాయం జరిగిన ప్రతిచోటా వినిపించే ఒక ధైర్యవంతుడి గొంతు. ఆయన పేరుతో ఇచ్చే అవార్డులు భావి తరాల కళాకారులకు స్ఫూర్తినిస్తూ, ప్రజా సమస్యల వైపు వారిని నడిపిస్తాయని ఆశిద్దాం..