2024 Geopolitics Roundup| 2024లో ప్రపంచంలోని చాలా దేశాల రాజకీయ ముఖచిత్రాలు మారిపోయాయి. కొంతమంది నాయకులు మళ్లీ అధికారం చేజిక్కించుకుంటే.. మరికొన్ని దేశాల్లో ఉన్న నాయకులను ప్రజలు గద్దె దించేశారు. రెండుసార్లు గెలిచిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకతను పక్కకు నెట్టి నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతోకాలంగా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా దేశం వదలి పలాయనం చేయాల్సివచ్చింది. అదే టైంలో సర్వేలన్నీ తప్పని రుజువు చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయ ఢంకా మోగిస్తే.. ప్రజాస్వామ్యానికి ఎంతో విలువనిచ్చే దక్షిణ కొరియాలో ఎవరూ ఊహించని విధంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇలా ఈ ఏడాది జరిగిన ఎన్నో రాజకీయ పరిణామాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
మళ్లీ గద్దెనెక్కిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ 47వ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికల్లో నిలబడిన ఆయన ఏకంగా 312 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు సాధించగా.. ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హ్యారిస్ కేవలం 226 ఓట్లు మాత్రమే పొందింది. ట్రంప్ విజయంతో అగ్రరాజ్యం మరోసారి ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
మూడోసారి మోదీ
భారత దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోనే బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. ప్రత్యర్థి ఇండియా కూటమి నుంచి బలమైన పోటీ ఎదుర్కొన్నప్పటికీ.. బీజేపీ అద్భుతమైన విజయం సాధించింది. దీంతో ప్రపంచంలో బడా దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్కు లాభం చేకూర్చే నిర్ణయాలే తీసుకోగలుగుతోంది.
దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ
ప్రజాస్వామ్యానికి ఎంతో విలువనిచ్చే దక్షిణ కొరియాలో ఆ దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. విపక్షం పార్లమెంటును కంట్రోల్ చేస్తోందని ఆరోపించిన ఆయన ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఎమర్జెన్సీ విధించిన కొన్ని గంటల్లోనే తొలగించారు. ఇది జరిగిన వెంటనే యూన్ సుక్ యోల్పై అభిశంసన తీర్మానం పెట్టిన పార్లమెంట్.. ఆయన్ను గద్దె దించేసింది.
విశ్వాస పరీక్షలో జర్మనీ ఛాన్సలర్ ఓటమి
జర్మనీ పార్లమెంటులో ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ షోలాజ్ విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. మొత్తం 733 సీట్లున్న పార్లమెంటులో షోలాజ్కు మద్దతుగా కేవలం 207 ఓట్లు మాత్రమే లభించాయి. వ్యతిరేకంగా 394 ఓట్లు రాగా, 116 మంది ఓటు వెయ్యలేదు. జర్మనీ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవితం చేసే విషయంలో ఆ దేశ ఆర్థిక మంత్రితో షోలాజ్కు కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రిని షోలాజ్ తన కేబినెట్ నుంచి తొలగించారు. దీంతో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కూలిపోయింది. ఈ క్రమంలో జరిగిన విశ్వాస పరీక్షలో షోలాజ్ ఫెయిలయ్యారు.
యూకేలో లేబర్ పార్టీ ఘనవిజయం
యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ విజయం ఆ దేశ రాజకీయ ముఖచిత్రానికి కొత్త రూపు తెచ్చిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ లీడర్ రిషి సునక్ను ఓడించిన కీర్ స్టార్మర్ ఆ దేశ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో 14 ఏళ్ల తర్వాత తొలిసారి కనర్జర్వేటివ్ పార్టీ ఆ దేశంలో ప్రతిపక్షం సీట్లో కూర్చోవలసి వచ్చింది.
బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా అవుట్
పదిహేనేళ్లపాటు బంగ్లాదేశ్ను ముందుండి నడిపించిన షేక్ హసీనాకు ఈ ఏడాది గట్టి షాక్ తగిలింది. స్వాతంత్ర్య సమరవీరుల వారసులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో మొదలైన నిరసనలు.. పోరాటంగా మారి షేక్ హసీనా గద్దెను కదిలించాయి. చివరకు ఆమె ఆ దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆమె తప్పుకోవడంతో పదిహేనేళ్ల తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మరోసారి రాజకీయ రణక్షేత్రంలో డ్రైవర్ సీటెక్కింది.
భారత్-చైనా బోర్డర్ సంధి
2020 గల్వాన్ గొడవ తర్వాత భారత్-చైనా సరిహద్దు సమస్య పెద్దదవుతూనే వచ్చింది. అయితే ఈ సమస్యకు కూడా 2024లో పరిష్కారం దొరికింది. రెండు దేశాల లీడర్ల సమావేశం తర్వాత.. ఈ ఏడాది డిసెంబరులో చైనా-భారత్ ఆరు పాయింట్ల ఒప్పందం చేసుకున్నాయి. భారత భద్రతా సలహదారు అజిత దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది.
బ్రిక్స్లో చేరిన ఐదు కొత్త దేశాలు
ప్రపంచంలో అమెరికా పెత్తనానికి సవాల్ విసురుతున్న బ్రిక్స్ దేశాల కూటమిలో మరో ఐదు దేశాలు చేరాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ఈ దేశాలు బ్రిక్స్ సభ్యత్వం తీసుకున్నాయి.
మళ్లీ పుతిన్ ప్రెసిడెన్సీ
ఈ ఏడాది మరోసారి రష్యా ఎన్నికలు గెలిచిన వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశంపై తన పట్టు ఇంకా బలంగానే ఉందని నిరూపించుకున్నాడు. ఈ ఆరేళ్ల టర్మ్ కూడా పూర్తి చేస్తే.. రష్యా అధ్యక్షుడిగా అత్యధిక సమయం సేవలందించిన నేతగా జోసెఫ్ స్టాలిన్ను కూడా పుతిన్ అధిగమిస్తాడు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో పుతిన్కు 87 శాతం దక్కడం గమనార్హం.
ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (putin) ఈ ఏడాది జూన్ నెలలో ఉత్తర కొరియాలో పర్యటించారు. పుతిన్ కోసం నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) రెడ్ కార్పెట్ పరిచారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా నుంచి ఉక్రెయిన్కు మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో నార్త్ కొరియాలో పుతిన్ పర్యటించడం కీలకంగా మారింది. ఈ పర్యటన తర్వాత నార్త్ కొరియా దళాలు కూడా రష్యా యుద్ధంలో పాలుపంచుకుంటున్నాయి.