ఇతర దేశాల్లో తయారైన ఐఫోన్లను అమెరికాలో అమ్మాలనుకోవడం సరికాదని, యాపిల్ కంపెనీ అమెరికాలోనే పెద్దఎత్తున మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుకోవాలంటూ ఇటీవల ఆ సంస్థకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు సెకండ్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. తన మాట వినకపోతే ఫలితం ఎలా ఉంటుందో కూడా చెప్పేశాడు. ఈ సెకండ్ వార్నింగ్ తో అయినా యాపిల్ కంపెనీ వెనక్కు తగ్గుతుందా..? ఇతర దేశాల్లో ఉన్న తయారీ యూనిట్లను మూసేసి, తట్టా బుట్టా సర్దుకుని అమెరికాకు వచ్చేస్తుందా..? వేచి చూడాలి.
తిరిగి తీసేసుకుందాం..
“ఈ ప్రపంచానికి మనం చాలా ఇచ్చాం, ఇప్పుడైనా వెనక్కి తీసుకుందాం..” అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కే సమయంలో ట్రంప్ ఇదే అర్థం వచ్చేట్టు మాట్లాడారు. ఇన్నాళ్లూ పన్నుల విషయంలో ఉదారంగా ఉన్నామని, పొరుగు దేశాలు తమపై అధిక పన్నులు విధిస్తున్నా సరిపెట్టుకున్నామని, ఇకపై అలా జరగడానికి వీళ్లేదని ప్రకటించారు. అన్నట్టుగానే అన్ని దేశాలపై ఎడాపెడా పన్నులు విధించారు. చైనాతో అయితే పన్నుల యుద్ధమే మొదలు పెట్టారు ట్రంప్. రెండు దేశాలు తగ్గేది లేదంటూ పన్నుల భారం పెంచుకుంటూ వెళ్లాయి. ఓ దశలో భారత్ కూడా ఇబ్బంది పడింది. అయితే ఆ తర్వాత ట్రంప్ శాంతించడంతో ప్రపంచ దేశాలు ఊపిరిపీల్చుకున్నాయి.
ఎవ్వర్నీ వదిలిపెట్టను..
ట్రంప్ టార్గెట్ ఎవరు..? ఇతర దేశాలా..? ఇతర దేశాలకు చెందిన కంపెనీలా..? అలాంటి నియమాలేం ఆయనకు లేవు. ఎవరైనా సరే.. అమెరికాకు కప్పం కట్టాల్సిందే. అమెరికానుంచి ఆదాయం పొందుతున్న ఎవర్నీ ఓ పట్టాన వదిలేలా లేరు ట్రంప్. అమెరికాలో సంపాదించిన మొత్తాన్ని విదేశాలకు పంపిస్తున్న ఉద్యోగులపై సైతం పన్నుల భారం మోపేందుకు కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. ఇక అమెరికా కంపెనీలకు కూడా ఆయన చుక్కలు చూపిస్తున్నారు. అతిపెద్ద బాధితురాలిగా ఐఫోన్ కంపెనీ మారడం ఇక్కడ విశేషం.
యాపిల్ కి వార్నింగ్..
ఇతర దేశాల్లో ఐ ఫోన్లు తయారు చేసి, వాటిని అమెరికాలో అమ్మడం సరికాదనేది ట్రంప్ అభిప్రాయం. దానివల్ల ఇతర దేశాలు లాభపడతాయని, అమెరికా పౌరులు పన్నుల రూపంలో నష్టపోతారని ఆయన అంటున్నారు. దీన్ని నివారించేందుకు అమెరికాలోనే ఐఫోన్లు తయారు చేయాలని పట్టుబట్టారు. ట్రంప్ ఫస్ట్ వార్నింగ్ ని ఐపీల్ సీఈఓ టిమ్ కుక్ పెడచెవిన పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ ద్వారా సెకండ్ వార్నింగ్ ఇచ్చారు. “అమెరికాలో అమ్ముడయ్యే ప్రతి యాపిల్ ప్రోడక్ట్ ని అమెరికాలోనే తయారు చేయాలి. లేదంటే ప్రభుత్వానికి యాపిల్ కంపెనీ 25 శాతం పన్ను చెల్లించాలి..” ఇదీ ట్రంప్ వార్నింగ్ సారాంశం. అదే జరిగితే.. భారత్ కి ఎక్కువ నష్టం జరిగే అవకాశముంది. ఇటీవల చైనా లోని మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను భారత్ కి తరలించాలని యాపిల్ సంస్థ భావిస్తోంది. ట్రంప్ వార్నింగ్ ప్రభావంతో ఆ కొత్త యూనిట్లు ఇక భారత్ లో లాంచ్ కాలేవు. వాటిని అమెరికాకే తరలిస్తారు. ట్రంప్ వార్నింగ్ వినకపోతే 25శాతం అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. టిమ్ కుక్ అంత ధైర్యం చేస్తారని అనుకోలేం. ఇక ట్రంప్ వార్నింగ్ తర్వాత యాపిల్ కంపెనీ షేర్లు కూడా పతనం అయ్యాయని తెలుస్తోంది. మరి దీనిపై టిమ్ కుక్ అధికారిక స్పందన ఏంటో వేచి చూడాలి.