Flight: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తాగినమైకంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన విషయం తెలిసిందే. గతేడాది నంబర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన మరువక ముందు ఇదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. మళ్లీ న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు పక్కన కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు.
శుక్రవారం రాత్రి న్యూయార్క్ నుంచి AA292 అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీకి బయల్దేరింది. ఆ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మైకంలో మూత్రవిసర్జన చేశాడు. అయితే అది తోటి ప్రయాణికుడిపై పడడంతో అతను సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వెంటనే సిబ్బంది పైలట్ ద్వారా ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేశారు.
విమానం 14 గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ కాగానే నిందితుడ్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇరుపక్షాల వాదనలు నమోదు చేసి విచారిస్తున్నారు.