American Judges : ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి చాలా సహజం. అధికార పీఠాన్ని దిగిపోతూ తదుపరి వచ్చే నాయకుడికి గౌరవప్రదంగా ఆ పదవిని, బాధ్యతల్ని అప్పగించాల్సి ఉంటుంది. కానీ.. ట్రంప్ దిగిపోయి బైడెన్ అధికారం చేపట్టే సమయంలో అగ్రరాజ్యంలో చోటుచేసుకున్న ఘటనలు, అక్కడి క్యాపిటల్ హిల్ మీద దాడి.. అమెరికా చరిత్రలో మిగిలిపోతుంది. అలాంటి ఘటనకు కారణమైన 1500 మందికి ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే క్షమాభిక్ష ప్రసాదించారు. వారంతా జాతీయవాదులంటూ పొగడ్తలు కురిపించారు. తన దగ్గరున్న అధికార దండాన్ని ఉపయోగించి.. ఆ ఘటనలో పాల్గొన్న వారికి న్యాయ విచారణ, కేసుల నుంచి ఉపశమనం కల్పించారు. అప్పుడు.. అమెరికాలోని ప్రతిపక్షాల నుంచి న్యాయవ్యవస్థ వరకు అనేక మంది భిన్నంగా స్పందిస్తున్నారు.
అమెరికా జాతీయ నిర్ణయాల్ని చర్చించే అత్యున్నత విధాయక భవనమైన క్యాపిటల్ హిల్.. ఇందులోనే సెనేట్, ప్రజాప్రతినిధుల సభలు నిర్వహిస్తుంటారు. అలాంటి భవనం మీద 2021 జనవరి 6 న ట్రంప్ మద్ధతుదారులు దాడులకు తెగపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. దేశంలో అల్లర్లు సృష్టించిన ట్రంప్ వర్గీయులు, జాతీయ భవనాలపైనా దాడులకు దిగారు. అలాంటి వారికి క్షమభిక్ష ప్రసాదిస్తూ.. ట్రంప్ చేసిన తొలి సంతకంతో కొందరు న్యాయమూర్తులు విభేదిస్తున్నారు. వీరిలో ఒకరు.. తాన్యా చుట్కాన్. దేశ వనరుల్ని నాశనం చేసేలా ఆనాటి ఘటను చేదు నిజమని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి.. దాన్ని ఏ క్షమాపణ మార్చలేదు అన్నారు. శాంతియుతంగా జరగాల్సిన అధికార మార్పిడిలో.. చోటు చేసుకున్న ఉల్లంఘనను ఎవరూ, ఎప్పటికీ సరిదిద్దలేరని వ్యాఖ్యానించారు.
ట్రంప్ వర్గీయుల ఆరోపణల ప్రకారం.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. అందుకే.. ప్రజా మద్ధతు ఉన్న ట్రంప్ ఓడిపోయారు. కానీ.. వారివి ఆరోపణలుగానే ఉన్నాయి కానీ, ఎక్కడా నిరూపించలేకపోయారు. తమ నాయకుడు అధికారం కోల్పోయాడన్న ఆవేశం తప్పా.. ఎలాంటి విచక్షణా పాటించలేదన్నది అనేక మంది నుంచి వినిపించిన మాట. అదే విషయాన్ని.. ట్రంప్ క్షమాభిక్ష తర్వాత బాహటంగానే వ్యక్తపరిచారు.. న్యాయమూర్తి బెరిల్ హూవెల్. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి మోసం జరగలేదని, అందుకు సాక్ష్యాధారాలు ఇంత వరకు ఎక్కడా లభించలేదన్న ఆయన.. శాంతియుతంగా జరగాల్సిన అధికార బదిలీకి నాడు ఓడిపోయిన వారు ఆటంకం కలిగించారని, అది ప్రజాస్వామ్య దేశంలో సరైంది కాదన్నారు. దేశానికి నష్టం కలిగించిన వారికి ఊరట కలిగిస్తూ వెళితే.. వచ్చే కాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
అధికారం చేపట్టగానే మద్ధతుదారులకు ఊరట కలిగించేలా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన మరో న్యాయమూర్తి కొలీన్ కొల్లార్ కోటెల్.. క్షమాభిక్షను అంగీకారయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అందరికీ ఒకేలాంటి నియమాలు, నిబంధనలు అమలు కావాలన్నారు. ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తును నిలిపి వేస్తున్నా, న్యాయ విచారణకు అధికారంతో అడ్డు తగిలిన భవిష్యత్తులో పరిణామాలు మారవచ్చన్నట్లు వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, విచారణ రికార్డులు, జ్యూరీ తీర్పులను న్యాయస్థానంలో భద్రపరిచినట్లు వెల్లడించారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్.. మద్ధతుదారులకు క్షమాభిక్ష విషయంపై స్పందించారు. తనకంటే ముందు అధికారం చేపట్టిన బైడెన్.. తన కుమారుడు, తన కుటుంబ సభ్యులు, పలువురు అధికారులకు క్షమభిక్ష కల్పించుకున్నారని తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, తానే మొదటి వాడిని కాదని తెలిపారు. అంతే కాదు.. తనపై కొన్ని కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయని వెల్లడించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటిసారే తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే అధికారం, అవకాశం ఉన్నా.. తాను వినియోగించుకోలేదని తెలిపారు. ఈ విషయంలో బైడెన్ కంటే చాలా ఉత్తమంగా వ్యవహరించినట్లు వ్యాఖ్యానించారు. అలాగే.. క్యాపిటల్ హిల్ పై దాడి ఘటనలో అరెస్ట్ అయిన వారిని దేశభక్తులుగా అభివర్ణించిన ట్రంప్.. దేశభక్తుల్ని కాపాడుకునేందుకే తాను క్షమాభిక్ష అధికారాన్ని వాడుకున్నట్లు తెలిపారు.