Vantara Hippos: కొలంబియాలోని మాగ్డలీనా నదీ తీరంలో పెరిగిపోయిన హిప్పోల జనాభాను నియంత్రించే క్రమంలో, అక్కడి ప్రభుత్వం సుమారు 80 హిప్పోలను చంపేయాలని (cull) తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులను ఆందోళనకు గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ‘వంతారా’ వ్యవస్థాపకులు అనంత్ ముఖేష్ అంబానీ ముందుకు వచ్చి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశారు. ఆ జంతువులను చంపడం కంటే, వాటిని భారతదేశంలోని గుజరాత్లో ఉన్న ‘వంతారా’కు తరలించి, అక్కడ సురక్షితంగా సంరక్షించాలని ఆయన కొలంబియా పర్యావరణ శాఖ మంత్రికి లేఖ రాశారు. ఒకరి తప్పిదాల వల్ల భూమి మీదకు వచ్చి, ఇప్పుడు ఆవాసాల సమస్యను ఎదుర్కొంటున్న ఆ మూగజీవాల పట్ల ఆయన చూపిన కరుణ అందరినీ ఆలోచింపజేస్తోంది.
అదును చూసి అండగా నిలుస్తున్న ‘వంతారా’ అద్భుత వ్యవస్థ
ఈ భారీ తరలింపు ప్రక్రియ కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఒక పక్కా శాస్త్రీయ ప్రణాళికతో కూడి ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత అధునాతన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటైన వంతారా, ఈ హిప్పోల రవాణా, వాటికి అవసరమైన బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్, ప్రయాణంలో వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే పశువైద్య బృందాలను సిద్ధం చేసింది. కేవలం తరలింపు మాత్రమే కాకుండా, గుజరాత్లోని జామ్నగర్లో హిప్పోల సహజ ఆవాసాలను పోలి ఉండేలా ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించి, వాటికి జీవితకాలం రక్షణ కల్పించేలా వంతారా ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను కొలంబియా ప్రభుత్వానికి అందించింది.
“ప్రతి ప్రాణం విలువైనదేష.. కరుణతో కూడిన మానవతా దృక్పథం
అనంత్ అంబానీ ఈ చొరవ వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. “ఈ ఎనభై హిప్పోలు తాము ఎక్కడ పుట్టాలో ఎంచుకోలేదు, అలాగే తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా సృష్టించుకోలేదు,” అని ఆయన పేర్కొన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతాయి. జీవించే హక్కు ప్రతి ప్రాణికీ ఉంటుందని బలంగా నమ్మే అంబానీ, సురక్షితమైన, మానవతాపూర్వక పరిష్కారం అందుబాటులో ఉన్నప్పుడు, హింసాత్మక మార్గాలను ఎంచుకోకూడదని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. జంతు సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి నిదర్శనంగా, ఈ రంగంలో గ్లోబల్ హ్యూమన్ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు.
పర్యావరణ సమతుల్యత – ప్రపంచ దేశాలకు సరికొత్త పాఠం
కొలంబియాలోని ఈ హిప్పోల సమస్య దశాబ్దాల క్రితం నాటిది. 1980లలో ఒక చిన్న సమూహం నుండి మొదలై, ఇప్పుడు సుమారు 200లకు చేరిన ఈ హిప్పోల జనాభా, స్థానిక జీవవైవిధ్యానికి, అక్కడి పర్యావరణ వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయి. వీటిని ‘ఆక్రమణ జాతి’ (invasive species)గా వర్గీకరించి, అధికారులు ప్రాణాంతక చర్యలకు ఉపక్రమించడం ఒక విషాద పరిణామం. అయితే, వంతారా అందిస్తున్న ఈ ప్రతిపాదన ద్వారా, పర్యావరణాన్ని కాపాడుకుంటూనే, మూగజీవాలను ఎలా కాపాడుకోవచ్చో అనేదానికి భారతదేశం ప్రపంచానికే ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. కరుణ, ప్రజా భద్రత అనేవి పరస్పర విరుద్ధమైనవి కాదని, శాస్త్రీయ దృక్పథంతో రెండింటినీ సమన్వయం చేయవచ్చని అంబానీ ఈ ప్రతిపాదన ద్వారా నిరూపిస్తున్నారు.
దౌత్యపరమైన ఆమోదాల కోసం నిరీక్షణ
ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన ప్రభుత్వ స్థాయి చర్చల్లో ఉంది. ఏదైనా తరలింపు జరిగే ముందు కొలంబియా మరియు భారత ప్రభుత్వాల నుండి అన్ని రకాల చట్టపరమైన, అంతర్జాతీయ అనుమతులు మరియు బయోసెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వంతారా బృందం పూర్తి సహకారంతో, ఏవైనా షరతులు ఉన్నా సరే, ఆ జంతువుల క్షేమం కోసం చర్చలకు సిద్ధంగా ఉంది. ఒక దేశం నుండి మరో దేశానికి వన్యప్రాణులను తరలించి సంరక్షించడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం కానుంది. ఈ ప్రాజెక్ట్ సఫలీకృతం అయితే, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జంతువులను కాపాడుకోవడానికి ఇది ఒక ‘గ్లోబల్ మోడల్’గా మారే అవకాశం ఉంది.
Also Read: హనీమూన్ మర్డర్ కేసులో ఊహించని మలుపు.. సోనమ్కు బెయిల్ మంజూరు