Big Stories

Earthquake: మరణాలు 20వేలకు పైనే?.. 200 భూప్రకంపణలు.. శవాల దిబ్బగా టర్కీ, సిరియా..

టర్కీ భూకంప విషాదం

Earthquake: చరిత్ర చూడని విషాదం. ప్రకృతి చేసిన విధ్వంసం. పెను ప్రళయం. మృత్యువు కరాళ నృత్యం చేసిన చోటు. భారీ భూకంపాలకు టర్కీ, సిరియా శిథిలాల కుప్పగా మారాయి. శవాల దిబ్బగా మిగిలాయి. భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

- Advertisement -

వరుస భూకంపాలతో ఇప్పటివరకు 5వేల మందికి పైగా చనిపోయారని స్థానిక మీడియా చెబుతోంది. కానీ, ఈ భూకంప విలయంలో మృతుల సంఖ్య 20 వేలకు పైగా ఉంటుందని WHO అంచనా. శిథిలాల తొలగింపు ముగిసే సరికి మరణ మృదంగం తీవ్రత తెలుస్తుందని అంటున్నారు. ఇక, భూకంపంలో గాయపడిన వారి సంఖ్య వేలల్లోనే.

- Advertisement -

టర్కీలో ఇప్పటివరకు సుమారు 4వేల మందికి పైగా మృతుల సంఖ్య తేలింది. సిరియాలో 1500 మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 20వేల మంది గాయపడగా.. సిరియాలో సుమారు 2వేల మంది క్షతగాత్రులుగా మారారు.

టర్కీలో సోమవారం నాటి మొదటి భూకంపం తర్వాత మరో 200 భూకంపాలు వచ్చినట్టు సైంటిస్టులు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై 4 అంతకంటే తీవ్ర స్థాయిలో 100 సార్లకు పైగా భూమి కంపించింది. ఇకపైనా మరిన్ని భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని.. సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా 5.0-6.0 తీవ్రతతో మరికొంతకాలం పాటు ఈ ప్రకంపనలు రావొచ్చని అంటున్నారు.

టర్కీలోని విద్యుత్ వ్యవస్థ, గ్యాస్ పైపు లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆస్పత్రులు, ఫుడ్ కోర్టులు, గ్యాస్‌ సరఫరా వ్యవస్థలకు విద్యుత్తును అందించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. మొబైల్‌ విద్యుత్తు ప్లాంట్లను ఆయా ప్రాంతాలకు పంపించారు. అణు విద్యుత్తు కేంద్రానికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇక, టర్కీలోని ‘లిమాక్‌ పోర్టు’ భూకంపం ధాటికి ధ్వంసమైంది. కంటైనర్లు ఉంచిన ప్రదేశంలో భారీగా మంటలు చెలరేగాయి.

మరోవైపు, భూకంపం కారణంగా ఓ జైలు నేలమట్టమైంది. అందులో ఉన్న కరుడుకట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పారిపోయినట్టు తెలుస్తోంది. భూకంప విధ్వంసం నుంచి కోలుకోవడానికి టర్కీ, సిరియాలకు చాలా కాలమే పట్టొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News