Elon Musk US Elections Fraud| ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ పై అమెరికా కోర్టులో ఫ్రాడ్ కేసు నమోదైంది. అమెరికా ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజు ఒకరికి మిలియన్ డాలర్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడని ఫిలడెల్ఫియా కోర్టులో మస్క్కు వ్యతిరేకంగా కొందరు న్యాయ పోరాటానికి దిగారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ (పిఎసి).. ఎలన్ మస్క్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ప్రచారం కోసం ఆయన వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో భాగంగానే అమెరికా రాజ్యంగం కాపాడేందుకు తాను పిటీషన్ పెట్టానని దాన్ని సైన్ చేసిన వారిలో రోజూ ఒకరికి మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని మస్క్ ప్రకటించారు. చెప్పినట్లుగానే ఎన్నికలకు ఒకరోజు ముందు అంటే నవంబర్ 5 వరకు కూడా రోజూ ఒక వ్యక్తికి మిలియన్ డాలర్ల బహుమానం అందించారు.
అయితే వీరంతా వారి జీవితాల గురించి, జీవితాల్లో కష్టాల గురించి ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాల గురించి అందరి ముందు చెప్పాలి. ఎన్నికల్లో ప్రచారం చేయాలి. కానీ మిలియన్ డాలర్లు పొందిన వారందరినీ ఎలన్ మస్క్ ముందుగానే సెలెక్ట్ చేసుకొని డబ్బులిస్తున్నారని.. ర్యాండమ్ గా (లాటరీ పద్ధతి)లో ఇవ్వడం లేదని ఎలన్ మస్క్ పై కొందరు ఫిలడెల్ఫియా కోర్టులో ఫ్రాడ్ కేసు నమోదు చేశారు.
ఈ కేసు విచారణ సోమవారం సాయంత్రం జరిగింది. విచారణలో భాగంగా ఎలన్ మస్క్ తరపున లాయర్ క్రిస్ గోబర్ వాదిస్తూ.. “ప్రచారంలో పాల్గొని ప్రతిరోజు ఒకరికి మిలియన్ డాలర్లు ఇవ్వడం జరిగింది. అయితే బహుమానం పొందిన వారు ఆరిజోనా, మిచిగాన్ కు చెందిన వారు. వారి వ్యక్తిగత కష్టాలు, వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను బట్టి ఎవరి జీవిత కథ ఆసక్తికరంగా ఉందో వారికి మాత్రమే బహుమానం ఇవ్వడం జరిగింది. ర్యాండమ్ గా ఎవరికీ మిలియన్ డాలర్ల బహుమానం ఇస్తామని చెప్పలేదు. ఎవరికి బహుమానం ఇవ్వాలో ముందుగానే పరిశీలించి ఇస్తున్నాం” అని తెలిపారు.
బ్లామ్ బర్గ్ మీడియా కథనం ప్రకారం.. ఆస్టిన్ రాష్ట్రంలో కూడా ‘మెక్ అఫరీటీ’ అనే వ్యక్తి మస్క్ పై ఫ్రాడ్ కేసు నమోదు చేశారు. రాజ్యాంగం కాపాడాలి, వాక్ స్వాతంత్ర్యం, తుపాకీ కలిగి ఉండేందుకు అధికారం కోసం పిటీషన్ సైన్ చేయాలని.. అలా సైన్ చేసిన వారిలో రోజూ ఒకరికి మిలియన్ డాలర్లు ఇస్తామని చెప్పి ట్విట్టర్ ఎక్స్ లో ప్రజల మద్దతు కోసం ఆన్ లైన్ సపోర్ట్ తీసుకున్నారని.. కానీ ఇదంతా లాటరీలా ఉంటుందని భ్రమ కలిగించి.. పొలిటికల్ మార్కెటింగ్ చేశారని కేసులో మెక్ అఫరీటీ పేర్కొన్నారు. వెంటనే ఈ స్కామ్ ని ఆపి.. మస్క్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే మస్క్ లాయర్లు మిలియన్ డాలర్ల బహుమతి పతకం నవంబర్ 5 వరకే కొనసాగుతుందని.. ఎన్నికల తరువాత కొనసాగించే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.
మస్క్ వ్యతిరేకంగా ఫ్రాడ్ కేసు పెట్టిన వారిలో ఒక్కరైన క్రాస్నర్ అనే మహిళ.. మాట్లాడుతూ.. “ఇది లాటరీ పద్ధతి కాదు.. బహుమతి ఎవరికి ఇవ్వాలో ముందే నిర్ణయించారని నాకు తెలిసి ఉంటే.. నా జీవితం గురించి బహిరంగంగా మాట్లాడేదానిని కాదు. అయినా మా (ఫిలడెల్ఫియా) రాష్ట్రంలో ఒక్కరికీ మిలియన్ డాలర్ బహుమానం అందలేదు. మరోవైపు పెన్సిల్ వేనియాలో ముగ్గురికి ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు కీలక రాష్ట్రాలైన జార్జియా, నెవాడా, ఆరిజోనా, నార్త్ కెరోలినా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలకు చెందిన వారికి ఇచ్చారు. పైగా వారందరికి కూడా బహుమానం ఇప్పటివరకు అందలేదని తెలిసింది. ఈ విషయంలో ఎలన్ మస్క్, అతని ఎన్నికల ప్రచారం సంస్థ అమెరికా పిఎసి పై చర్యలు తీసుకోవాలి” అని ఆమె కోర్టుని కోరారు.
దీనిపై ఎలన్ మస్క్ లాయర్లు స్పందిస్తూ.. నవంబర్ 30 లోగా బహుమతికి ఎన్నికైన వారందరికీ మిలియన్ డాలర్ల మొత్తం ఇవ్వడం పూర్తవుతుందని కోర్టులో హామీ ఇచ్చారు.
ఇలాంటి కేసులో మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కూడా నమోదయ్యాయి. కానీ పెన్సిల్వేనియా కోర్టులో జడ్జి యాంజెలో పొగెలియెట్టా కేసుని కొట్టివేశారు.