HongKong fire accident: హాంకాంగ్లో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 55 మంది మరణించారు. సుమారు 300 మంది ఆచూకీ తెలియరాలేదు. చైనా పరిపాలన ప్రాంతంలో ఇది అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంగా చెప్పవచ్చు. దర్యాప్తు అధికారులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తుండగా.. మంటలు వేగంగా వ్యాపించడానికి శతాబ్దాల నాటి వెదురు పరంజా (వెదురు బొంగులు) లేదా నాణ్యత లేని చైనా నిర్మాణ వలలు (కన్స్ట్రక్షన్ నెట్స్) కారణం అయ్యి ఉండొచ్చని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద విపత్తులలో ఒకటిగా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత మొదటిసారిగా లెవల్ 5 తీవ్రత గల అగ్నిప్రమాదం నమోదు కావడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్లో 8 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాక్ 31 అంతస్తుల నిర్మాణం ఉంది. దాదాపు 2,000 అపార్ట్మెంట్లలో 4,800 మంది నివసిస్తున్నారు. ఈ కాంప్లెక్స్లో మంటలు చెలరేగడం, వేగంగా వ్యాపించడం భారీ నష్టానికి దారితీసింది.
అధికారులు మంటలు ఇంత వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణాలను గుర్తించారు. ఈ అపార్ట్మెంట్ల బయటి గోడల నిర్మాణం కోసం వెదురు బొంగులు వాడారు. కన్స్ట్రక్షన్ సమయంలో వాడిన నెట్ను తొలగించకపోవడం మరో లోపంగా ఉంది. అగ్నిప్రమాదం సమయంలో భారీగా గాలులు వీయడం వల్ల అగ్నికీలలు ఇతర టవర్లకూ పాకి, అవి తగలబడ్డాయి. ఈ నిర్మాణాత్మక లోపాలు, వాతావరణ పరిస్థితులు అగ్ని వ్యాప్తిని అసాధారణంగా పెంచాయి.
ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంటలు, దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపించి ఉండటం కనిపించింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. 700 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీస్, భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. అధికారులు దాదాపు 90 శాతం మంది నివాసితులను భవనం నుండి సురక్షితంగా తరలించినట్లు తెలిపారు. అత్యవసర బృందాలు కనిపించకుండా పోయిన వారి కోసం ఇంకా వెతుకుతున్నాయి. అగ్నిమాపక శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. సమీపంలోని నివాసితులు ఇంటి లోపలే ఉండాలని, తలుపులు, కిటికీలు మూసి ప్రశాంతంగా ఉండాలని సూచించింది.
హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ ఈ భారీ అగ్నిప్రమాదంపై స్పందించారు. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని పరిశోధించడానికి పోలీసులు, అగ్నిమాపక విభాగం ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ఘటనకు కారణమైన ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ సంతాపం వ్యక్తం చేశారు. గతంలో 17 ఏళ్ల క్రితం జరిగిన లెవల్ 5 అగ్నిప్రమాదంలో నలుగురు మరణించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు.
ALSO READ: Visakhapatnam trains: విశాఖపట్నం నుంచి బయల్దేరే రైళ్లు దారి మళ్లింపు, కారణం ఏంటంటే?