Pak court acquits ex-PM Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్కు మరో ఊరట లభించింది. ఆయనను గత కొంతకాలంగా వెంటాడిన తోషాఖానా కేసు నుంచి విముక్తి లభించింది. తోషాఖానా కేసుపై విచారించిన తర్వాత ఇమ్రాన్తో పాటు ఆయన పార్టీ సీనియర్ నేతలను ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
కాగా, 2022లో తోషాఖానా అవినీతికి సంబంధించిన విషయంలో ఇమ్రాన్ ఖాన్ను ఎన్నికల కమిషన్ అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన నిరసన వ్యక్తం చేయడంతో కేసు నమోదైంది.
ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్తోపాటు మాజీ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీని కూడా నిర్దోషిగా ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ దగ్గర దౌత్య పరమైన రహస్యాలు ఏమీ తన దగ్గర ఉంచుకోలేదని, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర కూడా ఏమి లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అయితే ఈ తోషాఖానా విషయానికొస్తే.. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని హోదాలో ఉన్న సమయంలో తనకు అందిన విలువైన బహుమతులను అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇతర దేశాల అధినేతల నుంచి పాకిస్తాన్ పాలకులకు అందే బహుమతులను భద్రపరిచే ఖజానాను తోషాఖానా అంటారు.
గతంలో ఆగస్టు 5న తోషాఖానా కేసులో ఇమ్రాన్కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించినా ఇస్లామాబాద్ హైకోర్టు దాన్ని సస్పెండ్ చేసింది. కాగా, అంతకుముందు అక్రమాస్తుల కేసులో ఇమ్రాన్ భార్యకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.
అల్ ఖదీర్ యూనివర్సిటీకి ఆర్థిక సహాయానికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి రావల్పిండి అకౌంటబిలిటీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో అల్ ఖాదిర్ యూనివర్సిటీని స్థాపించడానికి ల్యాండ్ డెవలపర్ నుంచి ఆర్థిక సాయం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే బుష్రా బీబీ, ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు. కాగా, ఖాన్తో వివాహం చట్టవిరుద్ధమని నిర్ధారించిన కేసులో ఆమె జైలులోనే ఉంటుంది.