నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం..! ఖడ్గం సినిమాలో రవితేజ పాట ఇది. ఇండియాలో ఓ సాధారణ మధ్య తరగతి ప్రజలు మెంటాలిటీని సూచిస్తూ ఈ పాట రాశారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ఈ కింద వార్త చదవితే మీకే తెలుస్తుంది..
కొండా సురేఖ పై వేటు తప్పదంటున్నారు. ఆ ఫ్యామిలీ ఏ పార్టీలోకి వెల్లబోతుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీ అని కొంత మంది, జనసేన అని మరికొందరు ఇలా ఎవరికి తోచింది వారు ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇంకో అంశం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. అది తీన్మార్ మల్లన్న గురించి.
తను కేటీఆర్కు క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించాడు. కేటీఆర్ కొడుకును బాడీ షేమింగ్ చేస్తూ విమర్శలు చేసినందుకు పశ్చాత్తాప పడినట్టుగా వెల్లడించాడు. దీంతో తీన్మార్ మల్లన్న పార్టీ.. బీఆరెస్ అనుబంధంగా మారనుందనే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆయన సారీ చెప్పాలంటే ఆ లిస్టు చాంతాడంత ఉంటుంది.
జర్నలిజం పేరుతో మల్లన్న ముసుగుతో ఎడాపెడా తిట్టడమే పనిగా పెట్టుకున్న వైనం మొదట్లో అందరినీ ఆకట్టుకున్నా.. ఆ తరువాత రొటీన్ రొడ్డకొట్టుడు విధానం ఏవగింపు కలిగించేలా చేసింది. తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు ఎవరెవరి వద్దకు వెళ్లాడో.. ఎవరిని సపోర్టు చేశాడో.. ఇప్పుడు తన స్టాండ్ ఏంటో.. రాజకీయాలను దగ్గరగా పరిశీలించే ప్రతి ఒక్కరికీ తెలుసు.
నిలకడలేని మెంటాలిటీ అతనిదని కూడా తెలుసుకోగలరు. ఏ పార్టీకి సపోర్టు చేసినా.. ఎవరికి మద్దతిచ్చినా ఆ బంధం, అనుబంధం తాత్కాలికమే. అది ఎంతోకాలం నిలిచేదైతే కాదు. నేపథ్యం గమనిస్తే ఇదే తేటతెల్లమయ్యేది. రేవంత్రెడ్డిని హీరో చేసినా.. కేసీఆర్ను బాతాల పోశెట్టి అన్నా.. కవితను తైతక్కని నోటి దురుసు ప్రదర్శించినా.. అది మల్లన్న ఉనికిని చాటుకునేందుకు ఇంకొకరిని బలి పెట్టేందుకు చేసిన ప్రయోగం, ప్రయత్నంగానే చూడాలి.
కానీ చేరదీసి చంకనెత్తుకునేందుకు మాత్రం ఎవరూ సాహించరనేది క్లారిటీ. ఇక ఇప్పుడు కొండా ఫ్యామిలీ గురించి చెప్పుకుందాం. కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కునే బాపతు అని అందరికీ అర్థమైంది. చేరదీసి మంత్రి పదవి ఇచ్చిన రేవంత్ మెడపైనే కత్తి పెట్టి బెదిరించేందుకు ఏమాత్రం వెనుకాడలేదు కొండా మురళి.
మరి ఇప్పుడు వీరిని ఏ పార్టీ చేరదీస్తుంది? వీరిని నమ్మేదెలా? బీసీల ముసుగులో ఉన్నా సరే, వీరి వల్ల ప్రయోజనం కంటే నష్టమేనని గత అనుభవాలను పాఠాలుగా తీసుకున్న ఎవరూ ఇంత సాహసం చేయరు. అందుకే అన్నాను.. నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం అని!