Raisi discuss Sharif: పాకిస్థాన్తో వ్యాపార సంబంధాలను బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది ఇరాన్. ఇందులోభాగంగా ఉన్నతస్థాయి బృందంతో కలిసి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదేశంలో పర్యటిస్తున్నారు. మూడురోజుల టూర్లో భాగంగా ఇస్లామాబాద్ చేరుకున్న రైసీకి ఘన స్వాగతం లభించింది. ఈ టూర్లో ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలపై పలు ఒప్పందాలు జరిగాయి.
ఇస్లామాబాద్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. వర్తక వ్యాపారాన్ని 10 బిలియన్లకు పెంచాలని నిర్ణయించారు. వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. జనవరిలో ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఇస్లామాబాద్లోని ఓ హైవేకు ఇరాన్ అవెన్యూ అని నామకరణం చేశారు. అనంతరం రైసీ బృందానికి ప్రత్యేకంగా విందు ఇచ్చారు పాక్ ప్రధాని.
పాకిస్థాన్ దేశాక్షుడు జర్ధానీతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించుకున్నారు. దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని నేతలు నిర్ణయించారు. నాలుగు నెలల కిందట బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగిన దాడుల వ్యవహారంపై చిన్నపాటి చర్చ జరిగినట్టు ఆదేశ మీడియాలో వార్తలొస్తున్నాయి. అక్కడి నుంచి కరాచీ, లాహోర్లోని అక్కడి ముఖ్యనేతలతో రైనీ భేటీ కానున్నారు. పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆదేశంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ పర్యటించడం ఇదే తొలిసారి.